CM KCR vs Revanth Reddy(Telangana politics): రైతు రుణమాఫీ ఏమైంది? ఇంకెప్పుడిస్తారు? రైతులను దగా చేసిన కేసీఆర్. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పదే పదే పేలుస్తున్న డైలాగ్స్ ఇవి. ఎక్కడికెళ్లినా రుణమాఫీ గురించే ప్రశ్నిస్తున్నారు. ఏ సభలోనైనా రుణమాఫీ గురించే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. రైతులకు ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. రేవంత్ మాటలకు.. గులాబీ బాస్ గుండె గుబేల్ అంటోంది.
అసలే ఎన్నికల సీజన్. రుణమాఫీపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాడుతోంది. రేవంత్రెడ్డి అయితే అస్సలు వదిలేదేలే అంటున్నారు. ఇలాగైతే లాభం లేదనుకున్నారో ఏమో.. ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీని.. ఎన్నికలకు ఐదు నెలల ముందు అమలు చేసేందుకు ముందుకొచ్చారు. ఎలక్షన్ స్టంట్ కాక ఇంకేంటి మరి? ఇప్పుడు రుణమాఫీ చేసినా రైతులు నమ్ముతారా?
అవును, రైతు రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎప్పటినుంచో కాదు.. గురువారం నుంచే రుణమాఫీ అమలు చేస్తారట. కాకపోతే.. అందరికీ ఒకేసారి ఇవ్వరు. విడతల వారీగా ఇస్తారు. సెప్టెంబర్ నాటికి అందరికీ ఇస్తామంటున్నారు. కాకపోతే కాంగ్రెస్ హామీ ఇస్తున్నట్టు 2 లక్షలు కాదు.. బీఆర్ఎస్ చెప్పినట్టు లక్ష వరకే రుణమాఫీ.
మరి ఇన్నాళ్లూ రైతు రుణమాఫీ ఎందుకు మాఫీ చేయలేదంటే.. కేసీఆర్ చెబుతున్న కహానీ ఆసక్తికరంగా ఉంది. కరోనా వల్ల కొంత, కేంద్రప్రభుత్వ ఆంక్షల వల్ల మరికొంత ఆలస్యమైందని వివరణ ఇస్తున్నారు. ఈ గ్యాప్లో ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి.. కొత్త సెక్రటేరియట్ కట్టుకున్నారు.. జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టారు.. హైదరాబాద్లో ఖరీదైన భూములు అమ్మారు.. దళితబంధు అంటూ హంగామా చేశారు.. మిగతా వాటిని రాని నగదు ఇబ్బంది.. రైతు రుణమాఫీకే వచ్చిందా? అనేది అన్నదాతల ప్రశ్న. ఇదంతా ఎలక్షన్ కోసమేనని.. రేవంత్రెడ్డి విమర్శలతో వచ్చిన భయమేనని..అంటున్నారు. ఇంతకీ రైతులకు చేయాల్సిన రుణమాఫీ మొత్తం ఎంతంటే.. రూ.19వేల కోట్లు.