INDIA Alliance on Manipur violence(Today news paper telugu): రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఇండియా కూటమి ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రపతి విపక్ష ఎంపీలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మణిపూర్ హింసాకాండపై విపక్షాల ఆవేదనను వినాలని.. మణిపూర్ అంశంపై జోక్యం చేసుకోవాలని విపక్ష ఎంపీలు విజ్ఞప్తి చేశారు. విపక్ష బృందానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సారథ్యం వహించారు.
ఇండియా కూటమిలోని 21 మంది ఎంపీలు రెండురోజులపాటు మణిపూర్లో పర్యటించారు. అక్కడి బాధితులను కలిశారు. మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికీని కలిసి శాంతి భద్రతలను తిరిగి నెలకొనేలా చూడాలంటూ మెమొరాండం సమర్పించారు. ఇప్పుడు కూడా అదే తీరులో రాష్ట్రపతికి కూడా మెమోరాండమ్ సమర్పించారు విపక్ష ఎంపీలు.
మణిపూర్లో నెలకొన్న పరిస్థితిని రాష్ట్రపతికి వివరించామన్నారు మల్లికార్జున ఖర్గే. తాజా పరిస్థితులను వివరిస్తూ మెమోరాండమ్ ఇచ్చామని.. దానిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. తమ విజ్ఞప్తిపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు.
ఇక పార్లమెంట్లో కేంద్రం విపక్షాల గొంతు నొక్కుతుందని ఆరోపించారు ఖర్గే. తాము మాట్లాడుతుంటే మైక్లను మ్యూట్ చేస్తున్నారని ఆరోపించారు. మణిపూర్ అంశంపై ఇప్పటికైనా ప్రధాని నరేంద్రమోడీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు.