Delhi Ordinance bill latest news(Parliament monsoon session live updates): లోక్సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 249 ప్రకారం ఢిల్లీపై ఎలాంటి చట్టాన్నైనా తీసుకువచ్చే అధికారం ఈ సభకు ఉందని అమిత్ షా చెప్పారు. బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టే సమయంలో విపక్షాలు తీవ్రంగా నిరసనకు దిగాయి. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు విపక్ష ఎంపీలు. ఆర్డినెన్స్ బిల్లు ద్వారా నేషనల్ కేపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. సర్వీసుల్లో చట్టాలు చేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఉండాలన్నారు. కేంద్ర ఉద్దేశ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లును సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనగా భావిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలు ఇవ్వనుందని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు ఢిల్లీ అసెంబ్లీని, సుప్రీంకోర్టు తీర్పును నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు.
పార్లమెంట్ లో విపక్షాలను కేంద్రం బుల్డోజ్ చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై విపక్ష కూటమి INDIA ఎంత వరకైనా పోరాడుతుందని తెలిపారు. మణిపూర్ ఇష్యూపై కేంద్రానికి చర్చించే దమ్ము ధైర్యం లేదని విమర్శించారు. ప్రధాని మోడీ సభలో మాట్లాడకుండా.. బయట మాత్రం విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు.
మరోవైపు, మణిపూర్ హింసాత్మక ఘటనలపై ఆ రాష్ట్ర డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. శుక్రవారం విచారణకు డీజీపీ హాజరు కావాలని ఆదేశించింది. మణిపూర్లో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపింది. పోలీసులు పూర్తి నియంత్రణ కోల్పోయారని ధర్మాసం వ్యాఖ్యానించింది.