తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్లో టమాటా ధర కిలోకు 2 వందల రూపాయల రికార్డు ధర పలికింది. తెలంగాణ రాష్ట్రంలోనూ టమాటా ధర 200 రూపాయలు పలకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
నిన్న మొన్నటి వరకు 120 రూపాయలు ఉన్న టమాటా ధర అమాంతం పెరిగింది. టమాటాలకు డిమాండ్ ఎక్కువ ఉండడం, మర్కెట్లో దొరకడం లేదన్న సాకుతో 2వందలు దాటించేశారు వ్యాపారులు. దీంతో సామాన్యులు టమాటాల వంక చూడటమే మానేశారు.
ఈ నెలలో టమోటా ధరలు కిందికి దిగుతాయని అనుకున్నప్పటికీ ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఇటీవల కురిసిన వర్షాలు టమాటా దిగుబడులపై ప్రభావం చూపాయి. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ టమాటాలకు ఫేమస్. అయితే మదనపల్లె మార్కెట్ కు తక్కువ మొత్తంలో టమాటాలు రావడంతో ధర పెరుగుతోందని వ్యాపారులు తెలిపారు.
మరోవైపు టమాటాకు దేశ వ్యాప్తంగా గిరాకీ భారీగా పెరిగింది. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గడ్ కు చెందిన వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ లో మకాం వేసి టమాటాలను కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఇది చాలదా మరింత రేట్ పెంచేందుకు.