Manchu Vishnu & Manchu Manoj latest news(AP political news) : మంచు మోహన్బాబు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకుని.. విద్యాసంస్థల యజమానిగా ఉంటూనే రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొన్న నేత. మరోసారి ఈ ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది. మోహన్బాబు చిన్న కుమారుడు మనోజ్.. కుటుంబ సమేతంగా చంద్రబాబును కలవటం చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కీలక పరిణాలు చోటు చేసుకుంటున్నాయి. డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు చిన్నకుమారుడు, హీరో మంచు మనోజ్..ఆయన సతీమణి భూమా మౌనికా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా అయిపోయిందని.. చంద్రబాబు అప్పా యింట్మెంటు కోసం వేచి చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మంచు మనోజ్.. కొన్నాళ్ల కిందట టీడీపీకే చెందిన కర్నూలు నాయకుడు, దివంగత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇటీవలే మనోజ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతా లేదని మనోజ్ చెబుతున్నా.. భూమా ఫ్యామిలీ టీడీపీలో యాక్టివ్గా ఉండటంతో.. ఆ వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది.
మంచు మనోజ్ కూడా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్టు మంచు కుటుంబం కూడా లీకులిస్తోంది. తన కుమారులకు రాజకీయాలపై ఆసక్తి ఉందంటూ ఇటీవల మోహన్బాబు వ్యాఖ్యానించారు. అయితే..ఇప్పటికే మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో మనోజ్.. టీడీపీలో చేరి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఉంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో మోహన్బాబు వైసీపీలో చేరారు. అప్పట్లో పాలిటిక్స్లో యాక్టివ్ ఉన్నా.. తర్వాత కాలంలో జగన్తో ఆయన గ్యాప్ వచ్చినట్లు వార్తలు గుప్పమన్నాయి. దీనికి తోడు ఆయన విద్యా సంస్థలకు సంబంధించిన ఫీజుల బకాయిల విషయంలో ఆయన జగన్పై గుర్రుగా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి బలం చేకూరేలా.. ఆయన వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్నిసార్లు అయితే.. తాను రాజకీయాల్లోనే లేనంటూ చెబుతున్నారు. జగన్తో విభేదాల నేపథ్యంలో ఆయన చంద్రబాబుకు దగ్గర అవుతున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి.
మంచు విష్ణు విషయంలోనూ ఇదే మీమాంస ఉంది. ప్రస్తుతం విష్ణు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఎన్నికలు జరిగిన సమయంలోనూ జగన్ అండదండలతోనే ఆయన గెలిచారనే వార్తలు వచ్చాయి. ఆయన జగన్కు దగ్గర బంధువు కావటం సహా.. ఏపీ సీఎం అండదండలతోనే ఆయన మా అధ్యక్షుడిగా గెలిచారనే వార్తలు వినిపించాయి. దానికి తోడు విష్ణు.. తన బావ ఏపీ ముఖ్యమంత్రి అంటూ పలుమార్లు చెప్పుకోవటంతో.. వచ్చే ఎన్నిక్లలో ఆయన ఏదైనా స్థానం నుంచి నిలబడతారా అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
ఇటీవల మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మనోజు అనుచరుడి ఇంటికెళ్లి మరీ దాడి చేశారు విష్ణు. ఆ గొడవ అలానే రగులుతోంది. విష్ణు వైసీపీలో యాక్టివ్ అయ్యేందుకు సమాలోచనలు చేస్తున్నారని.. అన్నకు పోటీగా తమ్ముడు మనోజ్ టీడీపీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెబుతున్నారు. భవిష్యత్తులో వాళ్లిద్దరూ ఒకే స్థానం నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.
ఇక.. మోహన్బాబు గారాలపట్టి.. మంచు లక్ష్మి కూడా అన్నీ రంగాల్లోనూ యాక్టివ్ ఉంటారు. గతంలో ప్రధాని మోడీని..మోహన్బాబు కలిసిన నేపథ్యంలో మంచు లక్ష్మి కూడా ఉన్నారు. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారంటూ అప్పట్లోనే వార్తలు వినిపించాయి. ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ.. స్వయంగా మంచు కుటుంబాన్ని ఆహ్వానించిన నేపథ్యంలో.. ఆ కుటుంబం అంతా కమలం వైపు చూస్తుందనే వార్తలూ వచ్చాయి. చూడాలి.. రాజకీయాల్లో ఎవరూ శత్రువులు కాదు.. మిత్రులు కాదు అని… సామెత ప్రకారం ఎప్పుడేమైనా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.