అతిభారీ వానలు తెలంగాణను ఆగమాగం చేశాయి. వానలు తగ్గుముఖం పట్టిన వెంటనే.. సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ మీటింగ్ నిర్ణయాలపై అంతా ఆశగా చూశారు. గతంలో మాదిరి 10వేలు సాయం ప్రకటిస్తారా? ఈసారి అంతకుమించి ఇస్తారా? అని ఎదురుచూశారు. గంటల తరబడి సమావేశం సుదీర్ఘంగా సాగింది. కేబినెట్ భేటీ సారాంశాన్ని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అందులో వరద సాయానికి అతి తక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించింది.
10 జిల్లాల్లో వరద నష్టం తీవ్రంగా ఉందని.. రోడ్లు, కాలువల మరమ్మత్తులకు తక్షణ సాయంగా 500 కోట్లు రిలీజ్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు మంత్రి కేటీఆర్. మున్నేరు వాగు వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాణం.. రైతులకు వెంటనే విత్తనాలు, ఎరువుల సరఫరా ప్రారంభిస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు మంచిగా పని చేశారని.. ఓ ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను ఓ టీచర్ కాపాడారని.. వారందరికీ ఆగస్టు 15న ప్రభుత్వం తరఫున సన్మానిస్తామని తెలిపారు. అంతే. వరద సాయం గురించి మరేమీ లేదు. ఉద్యోగులకు సన్మానాలు, సత్కారాలా.. బాధితులు కోరుకుంది? చరిత్రలో లేనంత రికార్డు స్థాయి వాన, వరద ముంచెత్తితే.. ఇదా సర్కారు ప్రకటించే తక్షణ సాయం? 500 కోట్లు ఏ మూలకు వస్తాయి? బాధితులకు ఏమిస్తారు? ఇసుక మేటలు వేసిన రైతు పొలాలను ఏం చేస్తారు? నిండా మునిగిన నగరాలను, లోతట్టు ప్రాంతాలను ఎలా ఆదుకుంటారు? ఇవేమీ లేకుండా పైపై నిర్ణయాలతో వరద రాజకీయం ఏంటని మండిపడుతున్నారు బాధిత ప్రజలు.
ఇక, బీసీ నుంచి బలమైన గొంతుకంటూ దాసోజు శ్రవణ్కు, ఎస్టీ ఎలుక వర్గం నుంచి కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసుకుంది కేబినెట్. గతంలో గవర్నర్ తిప్పిపంపిన మూడు బిల్లులను మళ్లీ కేబినెట్ ఆమోదించి.. మళ్లీ బంతిని రాజ్భవన్లోకి నెట్టింది.
అనాథ పిల్లలంతా ప్రభుత్వ పిల్లలే అంటూ అనాథ పిల్లల సంరక్షణ కోసం ఆర్ఫన్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు కేటీఆర్. హైదరాబాద్లో హైబ్రిడ్ విధానంలో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కట్టాలని, నిమ్స్లో రూ.1800 కోట్లతో మరో 2 వేల పడకల ఏర్పాటు చేయాలని, బీడీ కార్మికులతో పాటు బీడీ టేకేదారులకు పింఛన్లు ఇవ్వాలని, మహబూబాబాద్లో ఉద్యాన కళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది తెలంగాణ మంత్రిమండలి.
అటు, ఇటీవలి వర్షాలకు నిండామునిగిన వరంగల్ నగరానికి ఎలాంటి సాయం కానీ, భవిష్యత్ ప్రణాళికలు కానీ ప్రకటించకుండా.. వరంగల్ మమునూరులో విమానాశ్రయం కోసం 253 ఎకరాలు ఇవ్వడానికి మాత్రం కేబినెట్ ఆమోదం తెలిపింది.