అసలే ఎన్నికల సీజన్. ఇప్పుడిక మామూలుగా ఉండవు హామీలు, నిర్ణయాలు. అంతంటారు, ఇంతంటారు. అది చేస్తాం, ఇది చేస్తాం అని చెబుతారు. చేసేదెప్పుడో.. అయ్యేదెప్పుడో. ఈలోగా ఎన్నికల గండం నుంచి గట్టెక్కేయొచ్చుగా అనేది అసలు ఉద్దేశంలా కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలపై ఇలాంటి విమర్శలే వస్తున్నాయి.
60వేల కోట్ల ఖర్చుతో.. వచ్చే మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో రైలును భారీగా విస్తరిస్తామని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ చెప్పిన రూట్ మ్యాప్ మామూలుగా లేదుమరి.
జేబీఎస్ నుంచి తూంకుంట వరకు.. ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మిస్తామని చెప్పారు. వీటితో పాటు ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు.. మియాపుర్ నుంచి లక్డీకపూల్ వరకు.. ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు.. ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకు.. ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకు.. రాయదుర్గం నుంచి శంషాబాద్ మెట్రో పూర్తి అయ్యాక ఫ్యూచర్లో కొత్తూరు మీదుగా షాద్నగర్ వరకు.. కొత్త మెట్రో రైల్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రకటించారు. అందులోనూ కేంద్రం సహకరించపోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేసి చూపిస్తుందని సవాల్ కూడా చేశారు.
చాలా సింపుల్గా చెప్పేశారు కేటీఆర్. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నాయిగా. ఎన్నైనా చెబుతారు.. ఏదైనా చెబుతారు.. అంటూ సోషల్ మీడియాలో అప్పుడే పంచ్లు పడుతున్నాయి. పాతబస్తీకి మెట్రో రైల్ ఏమైంది కేటీఆర్ సాబ్ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చేసేవేనా? కేవలం ఎన్నికల గారడీ? అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇన్నేసి రూట్లలో సాయిల్ టెస్ట్ చేయడానికే ఎంతో టైమ్ పడుతుందని.. ఇక రోడ్ వైడెనింగ్, ప్రైవేట్ స్థలాల సేకరణ, డిజైన్ లాంటి పనులకే ఏళ్లకు ఏళ్లు సమయం కావాలని.. అలాంటిది మూడు, నాలుగేళ్లలోనే ఇన్ని మార్గాల్లో మెట్రో రైలు కంప్లీట్ చేస్తామని కేటీఆర్ చెబుతున్నారంటే.. అది నమ్మేలే లేదని.. అంతా ఎలక్షన్ స్టంట్ అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.