Supreme Court on Manipur violence(Telugu breaking news): మణిపూర్ బాధిత మహిళల పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన బాధితులు తమ పిటిషన్లో కీలక విషయాలు ప్రస్తావించారు. తమ పేర్లు బయటకు రాకుండా X, Yలుగా పరిగణించి కేసు విచారించాలని కోరారు. కోర్టు డాక్యుమెంట్స్లో తమ పేర్లు ఇలానే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా ఓ సిట్ ఏర్పాటు చేయాలని, IG ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ జరిపించాలని కోరారు.
మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది కచ్చితంగా రాజ్యాంగ వైఫల్యమే అని కామెంట్ చేసింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు 14 రోజుల సమయం ఎందుకు పట్టిందని నిలదీసింది. ఇప్పటివరకు మహిళలపై జరిగిన దాడులపై ఎన్ని కేసులు నమోదయ్యాయని ప్రశ్నించింది. మణిపూర్ మహిళలకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కేంద్రాన్ని ఆదేశించారు. సమగ్ర విచారణ, పర్యవేక్షణ కోసం.. ప్రత్యేక సిట్ కానీ.. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని కానీ.. ఏర్పాటు చేస్తామని వెల్లడిస్తూ.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
మరోవైపు.. మణిపూర్ హింస కేసులో మైతేయి వర్గీయులకు చుక్కెదురైంది. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మణిపూర్లో జరుగుతున్నది జాతుల మధ్య హింస కాదని, మయన్మార్ నుంచి వస్తున్న సాయుధ కుకీ ఉగ్రవాదులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించినదని మైతేయిలు అంటున్నారు. మణిపూర్లో అక్రమంగా నల్లమందు సాగు చేయడం వల్ల జాతిహింస చోటుచేసుకుంటోందని వాళ్లు చెప్తున్నారు. మయన్మార్ నుంచి నిత్యం సరిహద్దులు దాటుతున్న కుకీ ఉగ్రవాదులు ఆయుధ బలంతో నల్లమందు సాగు చేయాలనుకుంటున్నారని పిటిషన్లో తెలిపారు. అయితే.. వాళ్ల పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వాస్తవాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలని హితవు పలికింది. ఒక తెగను ఉగ్రవాదులుగా సంబోధించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. దీంతో మైతేయీల సంస్థ తమ పిటిషన్ను వెనక్కు తీసుకుంది.