తెలంగాణను కంటి కలక సమస్య వెంటాడుతోంది. కొద్ది రోజులుగా కళ్ల కలక..కంజంక్టివైటిస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్తో.. కస్తూర్బా స్కూళ్లు, ఆదర్శ బడులు, వసతిగృహాల్లో విద్యార్థులకు ముప్పు పొంచి ఉంది. హైదరాబాద్లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు బాధితులు క్యూ కడుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశాలోనూ కేసులు పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఈ మూడు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోని ఒక్క సరోజనీదేవి ఆసుపత్రికే రోజుకు ముప్పై నుంచి నలభై మంది బాధితులు వెళ్తున్నారు.
కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే చాలు టక్కున అంటేసుకుంటుంది. తెలంగాణలోని వరంగల్, సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్తో పాటు ఏపీలోని విశాఖపట్నం, అకనాపల్లి, శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు తో పాటు పలు జిల్లాల్లో కళ్ళ కలక విజృంభిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఏపీలో ఈ ఏడాది కేసులు ఎక్కువయ్యాయి. స్కూళ్లల్లో చిన్నారుల నుంచి కళ్ళ కలక వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇందులో ఎక్కువ శాతం సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ళలో విద్యార్థులే కళ్ళకలక భారిన పడుతున్నారు.
పెద్దా చిన్ని తేడా లేకుండా అందరూ కళ్ళ కలకల భారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో నేత్ర విభాగాలకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఐడ్రాప్స్తో సులువుగా తగ్గిపోతోందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఇక మెడికల్ షాపుల్లో కళ్ళ కలక మందులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పాటు అల్పపీడనం ప్రభావంతో కొద్ది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టాయి. బలమైన గాలులు తోడవ్వడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. గాల్లో తేమశాతం పెరిగడంతో.. వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తోంది. కళ్ళ కలక చిన్న ఇన్ఫెక్షనే అయినప్పటికీ రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏ పని చేసుకోనీయకుండా జనాలను ఇబ్బందిపెడుతోంది. గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వాతావరణంలో మురికి కాలుష్య కారకాలు పెరగడంతో వ్యాప్తి చెందుతోంది.
అలర్జీతో కలిగే కలక ఆ వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. వైరస్ లేదా అలర్జీతో కలిగే కలక తక్కువ సమయంలో తీవ్రమైన లక్షణాలతో వస్తుంది. అంతే వేగంగా తగ్గిపోతుంది. బ్యాక్టీరియాతో కలిగే కలక కొన్ని రోజుల వ్యవధిలో పెరుగుతుంది. కళ్ల మీద అధిక ప్రభావం ఉంటుంది. కంటి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుందంటున్నారు వైద్యులు.