ISRO : పీఎస్ఎల్వీ -సీ 56 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగం చేపట్టనున్నారు. ఈ రాకెట్ ద్వారా సింగపూర్కు చెందిన 351.9 కిలోల బరువున్న డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహం, మరో 6 చిన్న పేలోడ్లను రోదసిలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ-సీ 56 రాకెట్ ద్వారా లుసియా-2 , స్కూప్-2, నులియన్ అనే నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతారు. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా విదేశీ ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్లోకి పంపుతారు.
పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 58వ ప్రయోగం. పీఎస్ఎల్వీ-సీ 56 రాకెట్ 44.4 మీటర్ల పొడవు, 228 టన్నుల బరువు కలిగి ఉంటుంది. శిఖర భాగాన ఉన్న ఉపగ్రహాన్ని 535 కిలోమీటర్ల ఎత్తులో రోదసిలో విడిచిపెడుతుంది. మొదట దీన్ని ఈ నెల 26న ప్రయోగించాలని ఇస్రో సన్నద్ధమైంది. అయితే సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని ఆదివారానికి వాయిదా వేసింది.
పీఎస్ఎల్వీ-సీ56 రాకెట్ ప్రయోగ నేపథ్యంలో ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి చేరుకుంది విదేశీ శాస్త్రవేత్తల బృందం. శ్రీహరికోట వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. షార్ పరిసర ప్రాంతాల్లో సీఐఎస్ఎఫ్ బలగాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. షార్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించారు. అక్కడకి ఇతరులెవరనీ అనుమతించడంలేదు అధికారులు.
ఆదివారం రాకెట్ ప్రయోగం నేపథ్యంలో సూళ్లూరుపేట శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్. పీఎస్ఎల్వీ-సీ56 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.