Manipur : తెగల మధ్య ఘర్షలతో అట్టుడుకుతున్న మణిపూర్లో ప్రతిపక్షాల కూటమి అడుగుపెట్టింది. ఆ రాష్ట్రంలో ఇండియా ఎంపీలు పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కొన్నిరోజులుగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులను కలవనున్నారు. కుకీ, మైతేయ్ వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడనున్నారు. మణిపూర్ లో జాతుల మధ్య సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకే తాము వచ్చామని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరీ తెలిపారు.
ఇండియాకు చెందిన 21 మంది సభ్యులతో కూడిన బృందం ఢిల్లీ నుంచి విమానంలో మణిపూర్ రాజధాని ఇంఫాల్కు వెళ్లింది. భద్రతా కారణాల దృష్ట్యా ఎంపీలందరూ హెలీకాప్టర్లో చురాచాంద్పూర్కు వెళ్లనున్నారు. అయితే ఒకటే హెలికాప్టర్ అందుబాటులో ఉంది. దీంతో 2 బృందాలుగా అక్కడికి చేరుకుంటారు. చురాచాంద్ పూర్ లోని పునరావాస కేంద్రాల్లో ఉన్న కుకీ వర్గ ప్రజలతో మాట్లాడతారు. బిష్ణుపూర్ జిల్లాలోని మైతేయ్ వర్గ ప్రజలు ఆశ్రయం పొందుతున్న పునరావాస కేంద్రానికి రోడ్డు మార్గంలో వెళతారు.
ఆదివారం మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉకియ్తో విపక్ష కూటిమి ఎంపీలు భేటీ అవుతారు. ఆ రాష్ట్రంలో త్వరగా శాంతియుత వాతావరణం నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను గవర్నర్ తో చర్చిస్తారు. ఇప్పటికే గవర్నర్ అనుసూయ ఉకియ్ చురాచాంద్పూర్ లోని పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఈ సమయంలో కొందరు మహిళలు గవర్నర్ తమ కష్టాలను చెప్పుకున్నారు. పడుతున్న బాధలు చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. బాధితుల ఆవేదన చూసి గవర్నర్ చలించిపోయారు. కుకీ వర్గానికి చెందిన బాధితులను ఓదార్చారు.
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనతోపాటు, మణిపూర్ ఘర్షణల కేసును కేంద్రం సీబీఐకి అప్పగించింది. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. వీడియో ఘటన కేసులో ఇద్దరు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.