Godavari river flood news(Andhra Pradesh today news): గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. అంతకంతకూ ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 54.6 అడుగులు దాటింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ముంపు బారిన పడిన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి.
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన గ్రామాలు వరదలకు అల్లాడుతున్నాయి. ఏజెన్సీలోని 40 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. శ్రీరామగిరి, పోతవరం, జీడిగుప్ప, తుమ్మిళేరు, చినమట్టపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. ఇవన్నీ మారుమూల గ్రామాలే. ఇక్కడ ప్రత్యేక పునరావాస కేంద్రాలు లేవు.
వరద బాధితులు సమీప కొండ ప్రాంతాల్లో గుడారాలు వేసుకున్నారు. 4 రోజులుగా అక్కడే బిక్కుబిక్కుమంటూ గడువుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంతో.. బాలింతలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.