Facebook Love: వేర్వేరు దేశాలకు చెందిన వారి పెళ్లిళ్లు చేసుకోవడం చాలా చూశాం. ఈ మధ్య ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకోడానికి సముద్రాలను దాటుతున్న ఘటనలు హాట్ టాపిక్ మారాయి. తాజాగా అలాంటి ఘటన ఏపీలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు.. శ్రీలంకకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. వీరి ప్రేమకు కూడా సోషల్ మీడియా కారణమైంది.
చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన యువకుడు లక్ష్మణ్ కు ఆరేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా శ్రీలంకకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్న లక్ష్మణ్ కు.. ఫేస్బుక్ ద్వారా పరిచమైన యువతి విఘ్నేశ్వరితో ఆరేళ్లుగా మాటలు కొనసాగుతున్నాయి. ఆ మాటలు కాస్త ప్రేమగా మారాయి.
ఇద్దరు ప్రేమలో పడటంతో యువతిని భారత్ రమ్మని పిలిచాడు లక్ష్మణ్. ప్రియుడి పిలుపుతో శ్రీలంక నుంచి భారత్ వచ్చేసింది ప్రియురాలు విఘ్నేశ్వరి. 20 రోజుల క్రితం వి.కోట మండలం ఆరిమాకులపల్లికి వచ్చేసింది. యువకుడు ఇంట్లో పరిచయం చేయడంతో 15 రోజుల క్రితం స్థానిక సాయిబాబా ఆలయంలో ఇరువురికి పెళ్లి చేశారు.
అయితే ఇప్పుడు ఆగస్టు 6 నాటికి విఘ్నేశ్వరి వీసా గడువు ముగియబోతుంది. దీంతో ఆ యువతిని చిత్తూరు ఎస్పీ ఆఫీసుకు పిలిచి వీసా గడువు వివరాలు సేకరించారు పోలీసులు. టూరిస్ట్ వీసా గడువు ముగుస్తున్న విషయం గుర్తు చేశారు. గడువు ముగిసే లోపు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు.
శ్రీలంకలో ఉన్న విఘ్నేశ్వరి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు పోలీసులు. లక్ష్మణ్, విఘ్నేశ్వరి చట్టబద్దంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని సూచించారు. విఘ్నేశ్వరి శ్రీలంకకు వెళితే ఆమె తల్లిదండ్రులు తిరిగి భారత్కు పంపిస్తారా లేదా అనేది సందిగ్దంగా మారింది.