World Tigers Day: బంగారు ఛాయ.. నలుపు రంగు చారలతో ఆకర్షణీయంగా ఉండే పెద్దపులి వన్యప్రాణుల్లోనే ప్రత్యేకం. పెద్ద పులులు గంభీరమైనవే కాదు…. క్రూరమైనవి కూడా. మిగతా వన్యప్రాణుల కంటే పెద్దపులిది వైవిధ్యమైన జీవన శైలి. పెద్దపులుల సంరక్షణ ఉద్దేశంతో జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవంగా నిర్వహిస్తారు.
20వ శతాబ్దం ఆరంభం నుంచి ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. పర్యావరణ సూచికలో అగ్ర భాగాన ఉండే పులులను సంరక్షించేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్లో టైగర్ సమ్మిట్ నిర్వహించారు. 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని తీర్మానించారు. 13 దేశాల శిఖరాగ్ర సదస్సులో పులుల సంతతి ఉన్న దేశాల్లో ఏటా జూలై 29న వరల్డ్ టైగర్స్ డే నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి టైగర్స్ డే ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నాగార్జునసాగర్ – శ్రీశైలం ప్రాంతం పెద్దపులుల అభయారణ్యం. ఇది దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఇది నల్లమల పరిధిలోనే ఉంది. ఇక్కడ పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొంతకాలంగా పులులను కడప జిల్లా లంకమల, చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవిలోనూ పెద్దపులు సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. నల్లమలలో పులుల సంతతి పెరగడంతోనే వాటి ఆవాసాన్ని ఇలా విస్తరించాయని తెలుస్తోంది. ప్రస్తుతం NSTRలోని ఆత్మకూరు, నంద్యాల, మార్కాపురం, గిద్దలూరు అటవీ డివిజన్ల పరిధిలో 77 పులులు ఉన్నట్టు వన్యప్రాణి నిపుణులు అంచనా వేశారు.
పర్యావరణ పరిరక్షణలో పెద్దపులులే ప్రధాన పాత్ర పోషిస్తాయి.పెద్దపులుల ఆవాసం అధికంగా ఉన్న చోట సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ఈ విషయాన్ని గుర్తించే ప్రపంచ దేశాలన్నీ పెద్దపులి సంరక్షణ కోసం కసరత్తు చేస్తున్నాయి. ఏటా జూలై 29న పులుల దినోత్సవం సందర్భంగా వివిధ రూపాల్లో వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రజలంతా పెద్దపులుల సంరక్షణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని అటవీ, పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.