ఎలక్షన్ ఇయర్లో జాతీయ కార్యవర్గంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా. తెలంగాణలో బీజేపీని ఊపులోకి తెచ్చిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను కొనసాగించారు. అటు ఏపీలో పురంధేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిన జేపీ నడ్డా.. జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ను కంటిన్యూ చేశారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ను తీసుకోవడం హైలైట్గా నిలుస్తోంది. మొన్నటివరకు ఆయన తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఉన్నారు. సడెన్గా ఆయన్ను తప్పించి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. అధిష్టానానికి కొందరు చేసిన ఫిర్యాదులు, ఆరోపణల వల్లే తనను తప్పించారని బాహాటంగా కామెంట్స్ చేశారు బండి సంజయ్. అదే సమయంలో బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై సొంత పార్టీలోనే విమర్శలు వచ్చాయి. తెలంగాణలో బండి సంజయ్కి ముందు, ఆ తర్వాత అన్నట్టు బీజేపీకి ఊపు తెచ్చిన నాయకుడంటూ కమలనాథులు మాట్లాడుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బండిని కేంద్ర కేబినెట్లోకి తీసుకోవచ్చనే ప్రచారం కూడా జరిగింది. మొత్తానికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన్ను తీసుకున్నారు. బండి వర్గాన్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు.
బండి సంజయ్ను తెలంగాణ అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత.. కమలం శ్రేణుల్లో చాలా మంది నిరాశకు గురయ్యాయి. కొందరు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. బండి సంజయ్ను తొలగించిన సమయంలో ఆయనకు కేంద్రమంత్రి పదవి లేదా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పిస్తామని జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు బండిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంతో బండి సంజయ్కు కేంద్రమంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని అర్థమవుతోంది. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతూనే.. రాష్ట్ర బీజేపీ పగ్గాలను నిర్వర్తిస్తారని అంటున్నారు.
బీజేపీ కార్యవర్గంలో ఛత్తీస్గఢ్కు పెద్దపీట దక్కింది. అక్కడి నుంచి ముగ్గురిని ఉపాధ్యక్షులుగా నియమించారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్సింగ్తోపాటు సరోజ్ పాండే, లతా ఉసెండికి వైస్ ప్రెసిడెంట్స్గా ఛాన్సిచ్చారు. మరోవైపు.. కేరళ మాజీ ముఖ్యమంత్రి, సోనియా గాంధీకి సన్నిహుతుడైన ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ను కూడా ఉపాధ్యక్షుడిగా నియమించారు. అతనితోపాటు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ తారీక్ మన్సూర్ కు కూడా వైస్ ప్రెసిడెంట్గా అవకాశమిచ్చారు.