కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదలతో.. భద్రాచలం దగ్గర గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకు 46.2 అడుగుల దగ్గరున్న ప్రవాహం.. మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరింది. సాయంత్రం కల్లా నీటిమట్టం 53 అడుగులుగా నమోదు అయింది. భారీగా వరద వెల్లువెత్తుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నదీతీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. హెలికాప్టర్ ను కూడా అందుబాటులో ఉంచారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉంచారు అధికారులు. క్షేత్రస్థాయిలో ప్రజల ఫోన్లకు హెచ్చరిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెసేజ్లు పంపుతున్నారు. ప్రజలకు అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇబ్బందులుంటే 1070 లేదా 1800 425 0101 నంబర్లను సంప్రదించాలని సూచించారు. పూర్తి స్థాయిలో వరదలు తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తగ్గుతూ..పెరుగుతూ వస్తున్న గోదావరిని చూసి తీరప్రాంత ప్రజలు గజగజ వణుకుతూ.. కంటి మీద కునుకు లేకుండా జాగారం చేస్తున్నారు. అధికారులు సైతం లోతట్టు ప్రాంత ప్రజలను నిరంతంరం అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో ఏజెన్సీకి గోదావరి ప్రమాదం పొంచి ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
మరోవైపు, మున్నేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. వాగుకు అనుకుని ఉన్న నందిగామ పరిసర ప్రాంత పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. నందిగామ దగ్గర జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరుల్లో 34 గ్రామాలకు వరద ముంపు పొంచిఉంది. ఆ గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఆరు గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా వాగులు, ప్రధాన కాలువలు పొంగిపొర్లుతున్నాయి.