Krishna River latest news(Andhra news today): కృష్ణా నదిలోకి వరద పోటెత్తింది. ఏపీ, తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వాగులు, వంకల ద్వారా నీరు కృష్ణా నదిలో కలుస్తోంది. కృష్ణా, తుంగభద్ర నదుల్లో జల ప్రవాహం ఉధృతంగా మారింది. తెలంగాణ, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది.
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాలైన ఆరావళి, శృంగేరి, మలైనాడు, వర్నాడు, శివమొగ్గలో కురుస్తున్న వర్షాలకు వరద భారీగా చేరుతోంది. తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1619.16 అడుగులకు చేరింది. కర్ణాటక పరిధిలోని నారాయణపూర్ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 33వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.
శ్రీశైలం డ్యామ్కు వరదనీరు చేరుతుండటంతో జలకళ సంతరించుకుంటోంది. జలాశయంలో నీటి నిల్వ 90 టీఎంసీలు దాటితే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తారు. అక్కడినుంచి నంద్యాల జిల్లా పరిధిలోని వెలుగోడు, గోరుకల్లు, అవుకు డ్యామ్లకు కృష్ణా జలాలు చేరుకుంటాయి.
ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటిమట్టాన్ని నిలువ చేస్తూ అదనపు నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ 50 గేట్లు 6 అడుగులు మేర ఎత్తగా.. 20 గేట్లను 5 అడుగులు మేరకు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామస్తులను నదీ పరివాహక ప్రాంత అధికారులను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.