జల దిగ్బంధనంలో గ్రామాలు.. తేరుకునేది ఎప్పుడు?ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద పొంగిపొర్లింది. మోయతుమ్మెద వాగుతోపాటు చెరువుల మత్తళ్లతో ఏర్పడిన చిన్నవాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో 52 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
జగిత్యాల జిల్లా ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జిల్లాలోని పలు మండలాల్లో ఎటూ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. మెట్ పల్లి పెద్ద చెరువు పూర్తిగా నిండి పారడంతో కళానగర్, సుల్తాన్పుర, ఆదర్శనగర్ శివారు కాలనీలో వరద నీరు భారీగా చేరుకుంది. కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్, ప్రకాశం రోడ్డు, జవహర్ రోడ్డు, గంగంపేట రోడ్డు, రవీంద్రా రోడ్లు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు.
నీటిలో చిక్కుకున్న 30 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాధితుల కోసం ఓ ఫంక్షన్ హాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద ఉధృతంగా ఉన్న ప్రాంతాలను నుంచి ప్రజలను జేసీబీలతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.
మెట్పల్లి పట్టణ శివారులో పలు ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 20 మందిని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. పిల్లలు, వృద్ధులను భుజాలపై మోసుకుంటూ పోలీసులు ఒడ్డుకు చేరారు.
ఇక రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలాగా మారాయి. ఎల్లంపల్లి, లోయర్ మానేర్ డ్యాం, మిడ్ మానేరు, అప్పర్ మానేరుకి వరుదనీరు భారిగా చేరు కుంటుండడంతో గెట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి పరివాహాక ప్రాంతాలలో నదులవద్దకి ఎవరు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు ఉంది. ఎల్లంపల్లి ఏరియాతో పాటు కడెం ప్రాజెక్టు నుండి 9 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుంది. అధికారులు 48 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.