దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీలోని కమలా నెహ్రూ కాలేజీకి చెందిన ఓ యువతిని పట్టపగలే పార్క్లో అతి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. సౌత్ ఢిల్లీలోని మాల్వియా నగర్ పార్క్లో ఈ దారుణం జరిగింది. చనిపోయిన యువతిని నర్గీస్గా గుర్తించారు. ఆమె తలపై గాయాలు ఉండటంతో ఇనుప రాడ్తో దాడి చేయడం వల్లే చనిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు.
నర్గీస్ తన బంధువైన ఇర్ఫాన్ అనే యువకుడితో పార్క్కు వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. అక్కడే ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో గొడవ జరిగింది. ఆమె పెళ్లికి నిరాకరించడంతో పక్కనే ఉన్న రాడ్తో ఆమె తలపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నర్గీస్ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఇర్ఫాన్ అక్కడి నుంచి పరారయ్యాడు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి ఇంట్లో వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో నర్గీస్ తనతో మాట్లాడటం మానేసిందని ఇర్ఫాన్ పోలీసులకు తెలిపాడు. ఇప్పుడు నేరుగా కలిసి విజ్ఞప్తి చేసినా.. అంగీకరించకపోవడంతోనే కొట్టినట్టు దర్యాప్తులో తెలిపాడు ఇర్ఫాన్.
ఢిల్లీలో గత 24 గంటల్లో ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. వరుస హత్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ జరిగాక ఢిల్లీ సురక్షితం అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఢిల్లీలో మహిళల భద్రతపై ఎవరికీ పట్టింపు లేదని.. దేశ రాజధానిలో నేరాలు ఆగకపోవడం బాధాకరమన్నారు.