గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని దూద్సాగర్ ఫాల్స్ చూసేందుకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. ప్రస్తుతం అక్కడ నిషేధాజ్ఞలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకుండా గోవా ప్రభుత్వంతో పాటు రైల్వేశాఖ నిషేధం విధించింది. అయినా మాకేంటి వెళ్తామంటారా? అయితే గుంజీలు తీయడం ప్రాక్టీస్ చేయండి. ఇలాగే రైల్వే ట్రాక్ వెంట నడుస్తూ దూద్సాగర్ చేరుకున్న కొందరు యువతీ, యువకులు గుంజీలు తీయాల్సి వచ్చింది. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వర్షాకాలంలో దూద్ సాగర్ జలపాతం సూపర్బ్గా ఉంటుంది. ఆ సుందర దృశ్యాలను చూసేందుకు దేశ నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ క్రమంలో ఒక స్టేషన్ ముందే దిగి పర్యాటకులు ట్రెక్కింగ్ చేసుకుంటూ రైల్వే ట్రాక్ల మీద ప్రయాణం సాగిస్తూ దూద్సాగర్ జలపాతం దగ్గరకు చేరుకుంటారు. ఇదే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. వాటిని నివారించేందుకు రైల్వే పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. అయినా లెక్క చేయకుండా ఓ టీమ్ రైల్వే ట్రాక్లపై నడవడంతో.. వారితో గుంజీలు తీయించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రైల్వే పోలీసులు.
ఇటీవల సంగెం తాలూకాలోని మైనాపి జలపాతంలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోవడంతో గోవా ప్రభుత్వం గతవారం రాష్ట్రంలోని జలపాతాలను సందర్శించకుండా నిషేధించింది. అలాగే పర్యాటకలు దక్షిణ గోవాలోని కొలెం స్టేషన్లో రైలు దిగిన తర్వాత దూద్సాగర్ చేరుకోవడానికి సౌత్ వెస్ట్రన్ రైల్వే లైన్ ట్రాక్ల వెంట నడుస్తారు. ఇలా చేయవద్దని రైల్వే పోలీసులు నిషేధం విధించారు.
కోచ్ లోపల నుంచి దూద్సాగర్ జలపాతం అందాలను ఆస్వాదించమని కోరుతున్నామంటూ నైరుతి రైల్వే ట్వీట్ చేసింది. ట్రాక్ల వెంట నడవడం ప్రాణాలక ప్రమాదమని రైల్వే చట్టంలోని 147, 159 సెక్షన్ల ప్రకారం నేరమని స్పష్టం చేసింది. ఇది రైళ్ల భద్రతకు కూడా ప్రమాదం కలిగిస్తుందని ట్వీట్ చేసింది. స్టేషన్ కంటే ముందే రైలు దిగి ప్రమాదకరంగా పట్టాలు దాటడం.. రైల్వే ట్రాక్పై నడవడాన్ని నిషేధించింది. అయినా సరే వెళ్తామంటే ఇలా గుంజీలు తీయాలంటూ పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది.