Revanth reddy today news(Latest news in telangana) : ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి న్యాయపోరాటం ఫలిస్తోంది. ORR టోల్గేట్ టెండర్లకు సంబంధించిన వివరాలను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్-RTI అధికారులు ఇవ్వడం లేదని రేవంత్రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు RTI అధికారుల తీరును తప్పుపట్టింది. ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించింది. అసలు సమాచార హక్కు చట్టం-RTI ఉన్నది ఎందుకని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే వాళ్లు చట్టసభల్లో ఏం మాట్లాడతారని హైకోర్టు నిలదీసింది. దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్ వివరాలు ఇచ్చేందుకు సిద్ధమని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. రెండు వారాల లోపు రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.
ORR టెండర్లలో అవకతవకలు జరిగాయని కొద్ది రోజులుగా రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భారీ కుంభకోణం దాగుందని ఆరోపిస్తున్నారు. వివరాల కోసం HMDA అధికారులను సంప్రదించారు. చివరకు RTI ద్వారా టెండర్లకు సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేసి నిజనిర్ధాణ చేయాలని అనుకున్నారు. అయితే ఇటు HMDA అధికారులు.. అటు RTI నుంచి పేపర్స్ రావడం లేదు. న్యాయపోరాటంలో భాగంగా హైకోర్టును ఆశ్రయించిన PCC చీఫ్.. HMDA, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ను ప్రతివాదులుగా చేర్చారు. RTI కింద అడిగిన సమాచారం ఇచ్చేలా ఆదేశించాలని హైకోర్టు వేసిన పిటిషన్లో రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. RTIకి కమిషనర్లు లేకపోవడంతోనే సమాచారం రావడం లేదని పిటిషన్లో ప్రస్తావించారు.
ORR టోల్గేట్ టెండర్ల వ్యవహారంలో వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రేవంత్రెడ్డి ఆరోపిస్తున్నారు. ఒకేసారి 30 ఏళ్లు లీజుకు ఇవ్వడం వెనక మతలబు ఏంటని నిలదీస్తున్నారు. ఔటర్ పరిధిలో ఏటా 800 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ORR టెండర్ దక్కించుకునేందుకు నాలుగు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. దరఖాస్తుల పరిశీలన తర్వాత IRB ఇన్ఫ్రా లిమిటెడ్ ఎల్-1గా నిలిచింది. మొత్తం 7వేల380 కోట్లకు బిడ్ ఖరారు అయింది. ఈ మొత్తం ఒకేసారి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అక్రమం దాగుందని రేవంత్రెడ్డి ఆరోపిస్తున్నారు. బంగారు గుడ్లు పెట్టే బాతులా ఒకేసారి 30 ఏళ్ల లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే హక్కు అసలు ప్రభుత్వానికి ఎక్కడిదని మండిపడుతున్నారు. ఈ వివరాల కోసమే RTIని ఆశ్రయించినా ఇవ్వడం లేదని హైకోర్టుకు వెళ్లారు.
ORRను మొత్తం 158 కిలోమీటర్ల మేర నిర్మించారు. జాతీయ, రాష్ట్ర రహదారులు దీనికి అనుసంధానమై ఉన్నాయి. ORR పరిధిలో 44 ఇంటర్ చేంజ్ పాయింట్లు ఉన్నాయి. అలాగే 22 ఇంటర్ ఛేంజ్ జంక్షన్లు ఉన్నాయి. టోల్ వసూళ్ల కింద ఏటా ప్రస్తుతం 400 నుంచి 500 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఏటా 5 శాతం వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. ఈ లెక్కన 30 ఏళ్ల నాటికి ORR ఆదాయం లక్ష కోట్ల వరకు వస్తుందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. కేవలం 7 వేల 380 కోట్ల రూపాయలకే టెండరు అప్పగించడం వెనక మతలబు ఉందని రేవంత్రెడ్డి ఆరోపిస్తున్నారు. వాస్తవాలు బయటపెట్టాలని నిలదీస్తున్నారు. RTI సమాచారం ఇచ్చేలా ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించి సానుకూల ఫలితం రాబట్టగలిగారు. ఇంతకాలం గోప్యంగా ఉంచిన ప్రభుత్వం కూడా ORR టెండర్ల పేపర్లను రేవంత్కు అప్పగించాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఆ డీటైల్స్ రేవంత్ చేతికి చిక్కితే..? ఇక సర్కారుకు దబిడి దిబిడే!