తెలంగాణలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉద్ధృతితో చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో కృష్ణా జిల్లా ఐతవరం వద్ద మున్నేరు వరదలో విద్యార్థులు చిక్కుకున్నారు. పోలీసులు వారిని క్రేన్ సహాయంతో అవతలి ఒడ్డుకు చేర్చారు. ఎగ్జామ్ సెంటర్ కు పంపించారు.
నందిగామలోని కాకాని వెంకటరత్నం కళాశాలలో డిగ్రీ సెమిస్టర్ పరీక్ష రాసేందుకు ఇబ్రహీంపట్నం, కంచికచర్లకు నుంచి నందిగామకు కొందరు విద్యార్థులు ప్రైవేట్ వాహనాల్లో ఐతవరం వరకు వచ్చారు. అక్కడ జాతీయ రహదారిపై మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ వాహనాలు ముందుకు వెళ్లలేదు. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో విద్యార్థులను అవతలి వైపునకు తరలించారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఆర్డీవో రవీందర్రావు అక్కడికి వెళ్లి పరిశీలించారు. మరోవైపు నందిగామ వద్ద పల్లగిరి కొండ సమీపంలో మున్నేరు వరదల్లో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోయారు . గురువారం మధ్యాహ్నం నుంచి వారు అక్కడే ఉండిపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉద్ధృతి నేపథ్యంలో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సు సర్వీసులు నడపనున్నారు. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.