Jamili Elections in India(Latest political news in India) : జమిలి ఎన్నికలపై పార్లమెంట్ వేదికగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ప్రస్తుతం సాధ్యం కాదని స్పష్టం చేసింది. జమిలి ఎన్నికలకు 5 ప్రధాన అడ్డంకులు ఉన్నాయని పేర్కొంది. గురువారం రాజ్యసభలో రాజస్థాన్ కు చెందిన కిరోడిలాల్ మీనా, తమిళనాడుకు చెందిన తంబిదురై జమిలి ఎన్నికలపై ప్రశ్నలు అడిగారు. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ సమాధానం ఇచ్చారు.
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో 5 అధికరణలను సవరించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. జమిలి ఎన్నికల వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు. అలాగే అనేక ప్రయోజనాలున్నాయని చెప్పారు. లోక్ సభ , రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహిస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం తగ్గుతుందన్నారు.
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం 5 అధికరణలకు సవరణ చేయాలి. పార్లమెంట్ కాలపరిమితికి సంబంధించిన అధికరణం 83, లోక్సభను రద్దు చేసేందుకు రాష్ట్రపతికి అధికారాలు కల్పించే అధికరణం 85, రాష్ట్ర శాసనసభల కాలపరిమితిని నిర్ధారించే అధికరణం 172, రాష్ట్ర అసెంబ్లీల రద్దు కోసం అధికరణం 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు అధికరణం 356ను సవరించాలి. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అంగీకారం తీసుకోవాలి. జమిలి ఎన్నికలకు అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్లు సమకూర్చుకోవాలి. అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం. ఈ అంశాలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు.
జమిలి ఎన్నికల నిర్వహణపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇప్పటికే నివేదిక సమర్పించింది. ఆ సిఫార్సులను కేంద్రం.. లా కమిషన్ ముందుంచింది. లోక్సభ, అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి సరైన మార్గసూచీ తయారుచేసే బాధ్యతను దానికి అప్పగించిందని కేంద్రమంత్రి తెలిపారు.