తెలంగాణను 10 రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం 97.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం రికార్డైంది. భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, కొత్తగూడెం, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్ధిపేట, యాదాద్రి, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి జిల్లాల్లో భారీ వానలు కురిశాయి.
రాష్ట్రంలో గురువారం నాటికి సీజన్ సగటు వర్షపాతం 329.3 మిల్లీమీటర్లు. అయితే ఇప్పటికే 530 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్ధిపేట, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జలప్రళయం సంభవించింది. వరదలతో జనజీవనం అతలాకుతలమైంది. అనేక గ్రామాలు, పట్టణాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.మోరంచపల్లి గ్రామం పూర్తిగా మునిగిపోయింది. స్థానికులు ఇళ్లు, చెట్లపైకి ఎక్కి ఆర్తనాదాలు చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మంలోనూ బీభత్సం సృష్టిస్తున్నారు. మున్నేరు వాగులో వరద ఉద్ధృతి పెరిగింది. మున్నేరు పరివాహక ప్రాంతం నీట మునిగింది.
హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై వరద నీరు ప్రవహిస్తోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద గురువారం నుంచి రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయం అదే పరిస్థితి నెలకొంది. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక కాలనీలు నీట మునిగాయి. నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో భారీ వర్షాల వల్లే శుక్రవారం కూడా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.