India Vs West Indies : వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్ లో శుభారంభం చేసింది. బ్రిడ్జిటౌన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో గెలిచింది. 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 22.5 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ( 46 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో 52 పరుగులు ) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. శుభ్ మన్ గిల్ (7) , సూర్య కుమార్ యాదవ్ (19), హార్ధిక్ పాండ్యా (5), శార్ధుల్ ఠాకూర్ (1) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. అయితే రవీంద్ర జడేజా (16 నాటౌట్), కెప్టెన్ రోహిత్ శర్మ (12 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో 3 వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.
టాస్ గెలిచి కెప్టెన్ రోహిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ భారత్ బౌలర్ల దాటికి కుప్పకూలింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లను భారత్ పేసర్లు పాండ్యా, ఠాకూర్, ముఖేశ్ కుమార్ వణికించారు. దీంతో విండీస్ జట్టు 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్ల స్పిన్ వలకు చిక్కారు. కులదీప్, జడేజా మాయాజాలంతో విండీస్ 23 ఓవర్లలోనే 114 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
విండీస్ కెప్టెన్ షైహోప్ ఒక్కడే 43 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఆ జట్టులో ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటయ్యారు. కనీసం 5 పరుగులు కూడా చేయలేదు. కులదీప్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు, హార్ధిక్ పాండ్యా, శార్ధుల్ ఠాకూర్, ముఖేశ్ కుమార్ తలో వికెట్ తీశారు. 3 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన కులదీప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో వన్డే బ్రిడ్జి టౌన్ వేదికగానే శనివారం జరుగుతుంది.