Projects water levels in AP & Telangana(Telugu news live): తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. గ్యాప్ లేకుండా దంచికొడుతున్న కుంభవృష్టి వానలతో తెలంగాణ, ఏపీ తడిచి ముద్దవుతున్నాయి. అతిభారీ వానలకు గోదావరి, కృష్ణమ్మ పరుగులు పెడుతున్నాయి. పైనున్న ఆల్మట్టి, నారాయణపూర్ గేట్లు ఎత్తేయగా.. నిజామాబాద్ జిల్లాలో SRSP గేట్ల నుంచి వరద గలగలా పారుతోంది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో పరివాహక ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 18 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 1091 పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను.. 1088 అడుగుల నీరు ఉంది. 88 వేల 827 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. 75 TMCల నీరు నిల్వ ఉంది.
కడెం ప్రాజెక్టులో సామర్థ్యానికి మించి వరద చేరింది. ఇన్ఫ్లో 3.50 లక్షల క్యూసెక్కులు కాగా 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తోంది. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున….దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కడం ప్రాజెక్ట్ కింది 10 గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద ఎక్కువైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.
3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20 TMCలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 15 TMCల నీరు ఉంది. ఎల్లంపల్లి ఏరియాతోపాటు కడెం ప్రాజెక్టు నుంచి లక్షా 39వేల 800 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. అధికారులు 25 గేట్లు ఎత్తి లక్షా 67వేల 800 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ఆసిఫాబాద్ జిల్లాలో 2 రోజులుగా వర్షం కురుస్తోంది. కొమరంభీం ప్రాజెక్టులోకి వరద వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 10.393 టీఎంసీలు. అయితే ప్రాజెక్టు కట్ట బలహీనంగా ఉండడంతో.. 5.409 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తున్నారు. ప్రాజెక్ట్ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు హెచ్చరిస్తున్నారు.
కృష్ణా నదికి కూడా వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతోంది. జూరాల నుంచి 76 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. ఇప్పటికే పులిచింత, ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తారు అధికారులు.