AP Rain Alert(Weather updates in andhra pradesh) : తెలంగాణతో పాటు అటు ఏపీని కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని చోట్ల గంట వ్యవధిలోనే భారీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు చోట్ల 5నుంచి 10 సెంటీమీటర్ల నమోదైంది.
భారీ వర్షాలకు విజయవాడ, విశాఖపట్నం నగరాలు జలసంద్రమయ్యాయి. బుధవారం శ్రీకాకుళం జిల్లా లావేరు, ఎచ్చెర్ల, ఆమదాలవలస, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, శ్రీకాకుళం జిల్లాల్లో వాగులు ఉగ్రరూపం దాల్చాయి. కల్వర్టులను ముంచేసి వరద నీరు ప్రవహింస్తోంది. పలు జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. విశాఖ బీచ్ రోడ్డు జలమయమైంది.
గురువారం నుంచి కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు పలు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది వాతావరణశాఖ. కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ప్రకాశం, బాపట్ల, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం నమోదు అవ్వొచ్చని అధికారులు తెలిపారు.
వర్షాలతో పాటు గంటకు 40నుంచి50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం వరకు అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉన్నందున రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి వానలకు వరద పోటెత్తుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి, శబరి నదుల ఉధృతితో విలీన మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రహదారులపైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు డివిజన్లో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. చింతూరు మండలం కుయుగూరు వద్ద జతీయ రహదారి పైనుంచి శబరి నది ప్రవహిస్తోంది. అలాగే చట్టి వద్ద జతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో పాటు చింతూరు మండలం ముకునూరు వద్ద కాజ్ వే పై సోకిలేరు వాగు ప్రవహిస్తోంది. వరదల ఎఫెక్ట్తో చింతూరు-వీఆర్ పురం మండలాల్లో సుమారు 25 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
ఇక కూనవరం మండలం కొండ్రాజుపేట కాజ్ వే పైకి వరద నీరు చేరడంతో సుమారు 25 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కూనవరం మండలం, పంద్రాజుపల్లి వద్ద ప్రధాన రహదారిపై వరదనీరు చేరింది. ఏటపాక మండలం, మురుమూరు, నందిగామ, రాయణపేట వద్ద ప్రధాన రహదారులపైకి వరద చేరింది. గోదావరి వరద ఉధృతితో.. కూనవరం-భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఏటపాక మండలం వీరాయిగూడెం వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. ఏటపాక-చింతూరు మండలాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. విఆర్ పురం మండలం, అన్నవరం వద్ద కాజ్ వే పై పైనుంచి అన్నవరం వాగు ప్రవహిస్తుండడంతో సుమారు 45 గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పోంగిపోర్లుతున్నాయి. అమరావతి- విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.