Kadem project live news(Telangana news updates): నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టిస్తోంది. ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ నుంచి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు కడెం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. 14 గేట్ల ద్వారా దిగువకు రెండున్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టుకు 18 వరద గేట్లు ఉండగా అందులో నాలుగు గేట్లు తెరుచుకుకోకుండా ఇంకా మొరాయిస్తున్నాయి. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. వరద ఉధృతి ఇదే తీరుగా కొనసాగితే ముప్పు తప్పదని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కడెం ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తడంతో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పరిస్థితిని పరిశీలించారు.