Vinukonda latest news(Breaking news in Andhra Pradesh): పల్నాడు మళ్లీ భగ్గుమంది. పార్టీల కక్షలు కస్సుమన్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య రచ్చ రచ్చ జరిగింది. నడిరోడ్డు మీద కర్రలు, రాడ్లతో కొట్టుకున్నారు. రాళ్లు విసురుకున్నారు. ఏకంగా ఎమ్మెల్యేపైనే దాడి యత్నం జరిగింది. అలర్ట్ అయిన పోలీసులు ఇరువర్గాలను కంట్రోల్ చేసేందుకు చాలా కష్టపడ్డారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారంటే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందో తెలుస్తోంది.
పల్నాడు జిల్లా వినుకొండలో హైటెన్షన్ నెలకొంది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటున్నందుకు.. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ టీడీపీ నిరసన ప్రదర్శన చేపట్టంది. అదే సమయంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడి వాహనం అటువైపుగా వెళ్లింది. ఎమ్మెల్యేను చూసిన టీడీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించారు. వారిని ఎమ్మెల్యే వెంట ఉన్న వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం ఘర్షణ పడ్డారు. దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి అందరిని చెదరగొట్టారు. వినుకొండ ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉంది.
పథకం ప్రకారమే తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అంటున్నారు. వినుకొండలో తనను లేకుండా చేసి.. గెలవాలని చూస్తున్నారంటూ టీడీపీపై మండిపడ్డారు.