CM KCR vs Revanth Reddy latest news(Telangana politics): ఇది వాన కాదు.. అది వరద కాదు. చరిత్ర చూడని వర్ష బీభత్సం. తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం. వారం పది రోజులుగా వానలు పడుతున్నాయి. వాతావరణ శాఖ అలర్ట్లు ఇస్తోంది. మరి, సర్కారు ఏం చేస్తోంది? సీఎం కేసీఆర్ ఓ సమీక్ష కూడా చేపట్టలేదు. ఇదే సమయంలో పార్టీలో చేరికలు మాత్రం చేసుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ తీరుపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేసినా ఉలుకూపలుకూ లేదు. ఈలోగా అనుకోను విపత్తు రానే వచ్చింది. బుధవారం రాత్రి తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడు శపించినట్టు శాసించాడు. కనీవినీ ఎరుగని రీతిలో అతిభారీ వర్షం కురిపించాడు. ఫలితం.. అనేక జిల్లాలు నిండా మునిగింది. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఇప్పటికీ వరద ముప్పులోనే ఉన్నాయి. వేలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపురంలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 69.8 సెంటీమీటర్ల వర్షం కురవగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 66.5 సెంటీ మీటర్ల వానపడింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10కి పైగా ప్రాంతాల్లో 30 సెం.మీ. నుంచి 50 సెం.మీ.ల వాన కురిసింది. 50కి పైగా ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని మొరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మొరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొరంచపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో బిల్డింగ్లు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. అంతకంతకు వరద ప్రవాహం పెరిగిపోవడంతో భయాందోళనలకు గురవుతున్నారు. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు.
భారీ వర్షాలపై ఉదయం నుంచి మీడియా బ్రేకింగ్ న్యూస్లతో హోరెత్తిస్తుండటంతో.. ఎట్టకేళకు సీఎం కేసీఆర్ స్పందించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తిగా నీట మునిగిన మోరంచపల్లి గ్రామంలో సహాయక చర్యల కోసం ఆర్మీ హెలికాప్టర్ను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. సీఎస్.. కంటోన్మెంట్ మిలటరీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. రెండు ఆర్మీ హెలికాప్టర్లను మొరంచపల్లెకి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఆ గ్రామానికి పంపించారు. వాన, వరద ఉధృతి ఎక్కువగా ఉన్న పలు జిల్లాలకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించారు సీఎం కేసీఆర్. విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించారు.
వానలు పడతాయని, పడుతున్నాయని ముందే తెలుసుగా.. ఈ సమీక్షలు, ప్రత్యేక అధికారుల కేటాయింపు ఏదో ముందే చేయొచ్చుగా అంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో కేసీఆర్ తీరుపై తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు.