Warangal rain news today(Latest news in telangana): ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వానతో వరంగల్ నగరం జలమయం అయింది. బుధవారం ఉదయం నుంచి కంటీన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి వరద నీటితో ప్రధాన కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి అయితే మరీ దుర్భరంగా మారింది. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
వరంగల్లోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఇండ్లు మొత్తం నీట మునిగాయి. మూడు, నాలుగు రోజులుగా ఎంతకు వాన తగ్గకపోవడంతో నిమిషం నిముషానికి వరద నీటి మట్టం పెరుగుతుండడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలకు గురి అవుతున్నారు బాధితులు. కొంతమంది ఇంటి డాబాలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరద నీరు ఇంట్లోకి చేరడంతో వస్తువులన్నీ తడిసిపోయాయి. సురక్షితంగా ఇంట్లో ఉండలేని, బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సహాయక చర్యల కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు.
సరైన మాస్టర్ ప్లాన్ లేకపోవడం, చెరువు ఎఫ్టీఎల్ జోన్లో కాలనీలు వెలియడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కాలనీలకు కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. మధురనగర్ కాలనీ, 19వ డివిజన్ లోని వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, శాంతినగర్ ప్రాంతాలు కూడా నీట మునిగాయి. వరంగల్ హంటర్రోడ్ లోని ఎన్.టి.ఆర్ కాలనీ, సాయినగర్ కాలనీ, సంతోషమాత కాలనీ బృందావన్ లలో పూర్తిగా వరద నీరు రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ స్థానిక పోలీస్ అధికారులతో కలిసి ట్రాక్టర్ లో ప్రయాణించి ముంపు పరిస్థితులను పరిశీలించారు. కాలనీలలో వరద నీరు చేరుకోవడంతో ఈ కాలనీల్లో నివాసం వుంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక భారీ వర్షాలకు వరంగల్లో రోడ్లలన్నీ నీట మునిగాయి. అసలు రోడ్డు ఎక్కడుందో కూడా కనిపించడం లేదు. వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.
భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు ఉధృతంగా ప్రహిస్తోంది. చెరువులన్నీ నిండుకుండలా మారి మత్తడి పోస్తున్నాయి. వరద నీటితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని బొమ్మర ఊర చెరువు మత్తడిపోస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే ఏసి రెడ్డి కాలనీ వర్షం నీటితో నిండిపోయింది. కాలనీలోని ఇండ్లలోకి నీళ్లు చేరుతుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక దేవురుప్పుల మండలం నిర్మాల వాగు బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో అమ్మపురం పెద్ద చెరువు అలుగు పోస్తుంది. దీంతో తొర్రూరు నర్సంపేట ప్రధాన రహదారిపై బత్తుల తండా, అమ్మపురం గ్రామానికి మధ్యలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. దీనితో తొర్రూరు అమ్మాపురం గ్రామ ప్రజలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అలాగే తోరూరు నర్సంపేట రాకపోకలు కూడా నిలిచిపోయాయి, పొలాలు మొత్తం జలమయంగా మారాయి. భారీ వర్షాలకు.. కమలాపూర్ బస్టాండ్ రోడ్డులో పూర్తిగా నీళ్లు చేరాయి. వర్షం నీరు వెళ్ళడానికి రోడ్డుపై డివైడర్లను జెసిబితో తొలగించారు పోలీసులు.
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో వాన బీభత్సం సృష్టించింది. పట్టణంలోని శ్రీనివాస కాలనీ, మమతా నగర్ కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరకాల అంబేద్కర్ విగ్రహం నుంచి బస్టాండ్కి వెళ్లే దారిలో నీరు ఇంట్లోకి రావడంతో నిత్యావసర వస్తువులు కొట్టుకపోయాయి. అలాగే భూపాలపల్లి పరకాల మెయిన్ దారిలో చలి వాగు పొంగి పొర్లుతోంది.
పరకాల మండలంలోని నాగారం గ్రామంలో పైడిపల్లి చెరువు కట్ట తెగడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. నడికూడ మండలంలోని నార్లాపూర్ వాగు పొంగి పొర్లడంతో దళిత కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలు సమీపంలో ఉన్న ఇండ్లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కంటాత్మకూర్- అనుమకొండకు వెళ్లేదారిలో వాగులు పొంగి పొర్లడంతో రహదారి జలదిగ్బంధమైంది. ఇంకా వర్షాలు కొడితే ఇండ్లు కూలే పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్న సంఘటనలు కనపడుతున్నాయి. చాలా గ్రామాలలో ప్రజల జీవనం అస్తవస్తంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి వద్ద వాగులో చిక్కుకుని ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. మేనమామ దశదినకర్మకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న ఇద్దరు అన్నదమ్ములు.. పోచంపల్లి-గంట్లకుంట గ్రామాల మధ్య వాగులో చిక్కుకున్నారు. గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం లభ్యంకాగా.. మరోకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.