Project: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టును ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు.
1978లో ప్రాజెక్టు పూర్తికాగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. మొత్తం 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 112 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. పూడిక కారణంగా ఇది 90.313 టీఎంసీల నీటి నిల్వకు పడిపోయింది. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాల్వలను అందుబాటులోకి తెచ్చారు.
నిజామాబాద్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ప్రాణధారగా నిలిచింది ఈ ప్రాజెక్టు. 60 ఏళ్లుగా ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తోంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ నిర్మాణం 1988లో పూర్తి కాగా.. ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పటికీ SRSP తెలంగాణ జీవనాడిగా ఉంది.