No Confidence Motion in Parliament(Telugu breaking news): మణిపూర్ అంశంపై పార్లమెంట్ లోప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ఇప్పుడు కీలక అస్త్రాన్ని సంధించింది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్ అవిశ్వాస తీర్మానంపై స్పీకర్కు నోటీసులిచ్చారు. విపక్షాల అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతిచ్చారు. చర్చ సమయాన్ని తర్వాత ప్రకటిస్తానన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పావులు కదపడం ఆసక్తిని రేపుతోంది. ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా కేంద్రంపై అవిశ్వాస తీర్మాన నోటీసును స్పీకర్ కు ఇచ్చారు. లోక్సభ రూల్ నెంబర్ – 198 B ప్రకారం బీఆర్ఎస్ తీర్మానం ఇచ్చింది. బిజినెస్ లిస్ట్ లో తీర్మానాన్ని చేర్చవలసిందిగా నామా కోరారు. బీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు. తమకు ఎన్డీఏ, ఇండియాతో ఎలాంటి సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రధాని మోదీ మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతోపాటు విపక్షాలకు పలు అంశాలు ప్రస్తావించే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్ కు కాంగ్రెస్, బీఆర్ఎస్ నోటీసులిచ్చాయి.
ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమికి 330 మంది సభ్యుల బలం ఉంది. విపక్షాల కూటమి ఇండియాకు 140 మంది సభ్యుల మద్దతు ఉంది. వివిధ పార్టీలకు చెందిన 60 మంది సభ్యులు కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయం. కానీ కేవలం మణిపూర్ అంశంలో చర్చ కోసం ప్రతిపక్షాలు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. 2018లో కూడా కేంద్రంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అప్పుడు ఎన్డీఏకు అనుకూలం 325 , వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాసం వీగిపోయింది.