BRO : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమా శుక్రవారం నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేదికపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాతృభాషపై తనకున్న మమకారాన్ని చెప్పుకొచ్చారు. తెలుగు సాహిత్యం విలువ తెలుసుకుంటే గొప్ప సినిమాలు చేయొచ్చని తెలిపారు. సాహిత్యంపై పట్టు పెంచుకుంటే ఆయా భాషల నుంచి గొప్ప డైరెక్టర్లు, రైటర్లు వస్తారని స్పష్టం చేశారు.
సినిమా తాను కోరుకున్న జీవితం కాదని పవన్ మరోసారి చెప్పారు. నటుడిని అవుతానని, రాజకీయాల్లో ఉంటాననీ ఊహించలేదని తెలిపారు. సమాజం నుంచి తీసుకోవడం కాదు, ఏదైనా ఇవ్వాలనే ఆలోచన ఉన్నవాణ్ని అన్నారు. సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. సముద్రఖని మూలకథకు త్రివిక్రమ్ సరికొత్త స్క్రీన్ప్లే సమకూర్చారని ప్రశంసించారు. చాలా మందికి తెలుగు భాష సరిగ్గా పలకడం రాదని.. తాను కూడా ఇప్పటికీ సరిదిద్దుకుంటూ ఉంటానని వివరించారు. తమిళుడైన సముద్రఖని బ్రో మూవీ కోసం తెలుగు నేర్చుకున్నారని .. అలాగే తాను తమిళం నేర్చుకుంటానని మాటిచ్చారు.
సినిమా అంటే తనకు ఇష్టం, ప్రేమ ఉంది కానీ సమాజంపై బాధ్యత ఉందని పవన్ చెప్పారు. అన్నయ్య మెగాస్టార్ గా స్టార్డమ్ సాధించిన తర్వాత తనకు హీరోలు అంటే చిరంజీవి, కృష్ణ గుర్తొచ్చేవారని పేర్కొన్నారు. వదిన ప్రోత్సాహం వల్లే హీరో అయ్యానని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి తమ్ముడిగా ఏదీ సులభంగా తీసుకోలేదన్నారు. కష్టపడి పనిచేశానని స్పష్టం చేశారు. త్రికరణ శుద్ధితో పనిచేయడమే తనను కోట్ల మంది అభిమానుల ముందు నిలబడేలా చేసిందన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇంత మంది హీరోలు వచ్చారంటే ఇబ్బందిగా ఉండొచ్చు కానీ తాము గొడ్డు చాకిరీ చేస్తామన్నారు. సినిమా కోసం నిరంతరం శ్రమిస్తుంటామని పేర్కొన్నారు.
తెలుగు భాషపై మక్కువ కలిగించడంలో త్రివిక్రమ్ కొత్తతరానికి మార్గనిర్దేశకత్వం చేశారని పవన్ ప్రశంసించారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని యువ రచయితలు రావాలని కోరారు. రాజమౌళి లాంటి వారు హాలీవుడ్ వరకు తెలుగు సినిమాను తీసుకెళ్లారని కొనియాడారు. తర్వాత తరం ఆ ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించాలని కోరారు. రాజమౌళి, మహేశ్బాబు కాంబినేషన్ లో వచ్చే సినిమా తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటానన్నారు.
మావయ్య , తన మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు సముద్రఖని అని సాయి ధరమ్ తేజ్ అన్నారు. ఈ సినిమా అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుందని తెలిపారు. ‘బ్రో’ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రైటర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ బ్రో చిత్రాన్ని నిర్మించారు. బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ కు యువ హీరోలు వరుణ్తేజ్, వైష్ణవ్తేజ్, రాజకీయ నాయకుడు టీజీ వెంకటేశ్ , బ్రహ్మానందం, ఊర్వశి రౌతేలా, బీవీఎస్ఎన్ ప్రసాద్, ఏఎం రత్నం తదితరులు హాజరయ్యారు.