AP Weather Updates : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ నుంచి ఓ హెచ్చరిక. రాష్ట్రానికి వానగండం పొంచి ఉందని వెదర్ డిపార్ట్మెంట్ హైఅలెర్ట్ ప్రకటించింది. రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశముండటంతో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ అక్కడక్కడా బుధవారం భారీవర్షాలు కురవవచ్చని తెలిపింది. మరో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ రానున్న 2రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు.
అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే కోస్తాలో ఆగకుండా వానలు కురుస్తున్నాయి. తాజాగా మరో 48గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు వెదర్ డిపార్ట్మెంట్ తెలపడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంది.వాయవ్య బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ఆవర్తనం మంగళవారం అల్పపీడనంగా మారింది. బుధవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులూ వీయవచ్చన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మంగళవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల మధ్య అత్యధికంగా అనకాపల్లి జిల్లా గొలుగొండలో 13సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే అల్లూరి జిల్లా కొయ్యూరులో 10.35 సెంటీమీటర్లు, విశాఖ గ్రామీణంలో 9.22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లాలో వరి పంట నీట మునిగింది. తిరువూరు, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో వాగులు పొంగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి 7,400 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా అంతేస్థాయిలో వరద చేరుతోంది. పొలాలు మునుగుతున్నాయని మంగళవారం రాత్రి నుంచి కాలువకు నీటిని వదలడం లేదు. విజయవాడలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని మునేరు ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం ఉదయం నుంచి వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట వద్ద గంట గంటకు పెరుగుతూ వచ్చిన నీటిమట్టం రాత్రి 8 గంటలకు 12.1 అడుగులకు చేరింది. అలాగే గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 9 గంటలకు ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 9.40 అడుగులకు చేరగా, 6,76,760 క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి వదిలారు.