BCCI : టీమిండియా సెప్టెంబర్ నుంచి సొంతగడ్డపై ఆడే మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. 6 నెలల వ్యవధిలో ఆడే మ్యాచ్ ల వివరాలు వెల్లడించింది. భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్లో ప్రాధాన్యం దక్కని వేదికల్లో ఎక్కువ మ్యాచ్ లు జరగనున్నాయి. అక్టోబర్ లో ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నికి ముందు భారత్ జట్టు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో ఈ మ్యాచ్లు మొహలి, ఇండోర్, రాజ్కోట్ లో నిర్వహిస్తారు.
ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతోనే 5 టీ20ల సిరీస్ ఆడుతుంది. నవంబర్ 23న తొలి మ్యాచ్ విశాఖలో, డిసెంబర్ 3న ఐదో టీ20 హైదరాబాద్ లో నిర్వహిస్తారు. నవంబర్ 26, 28, డిసెంబర్ 1 తేదీల్లో మిగతా టీ20లు తిరువనంతపురం, గోహతి, నాగ్పూర్ లో జరుగుతాయి.
అఫ్గానిస్థాన్తో జనవరి 11, 14, 17 తేదీల్లో భారత్ 3 టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. మొహలి, ఇండోర్, బెంగళూరులో ఈ మ్యాచ్ లు నిర్వహిస్తారు. జనవరి చివరిలో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి టెస్టు హైదరాబాద్లో జనవరి 25-29 మధ్య జరుగుతుంది. రెండో టెస్టు విశాఖలో ఫిబ్రవరి 2-6 మధ్య నిర్వహిస్తారు. మిగిలిన 3 టెస్టులు రాజ్కోట్, రాంచి, ధర్మశాల వేదికగా జరుగుతాయి.