No Confidence Motion in Lok Sabha(Telugu flash news) : మణిపూర్ అల్లర్ల అంశం పార్లమెంట్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై ప్రధాని మోదీ మాట్లాడాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. దీంతో ప్రధాని తప్పనిసరిగా మాట్లాడే పరిస్థితి తలెత్తుతుందని భావిస్తోంది. తమకు పలు అంశాలను ప్రస్తావించే అవకాశం లభిస్తుందని ఆ కూటమి యోచిస్తోంది. ఇప్పటికే విపక్షాలు ఈ విషయంపై చర్చించాయి.
విపక్షాలు బుధవారం అవిశ్వాస తీర్మాన నోటీసు ఇస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదా సిద్ధమైంది. 50 మంది ఎంపీలతో సంతకాలు చేయించాల్సి ఉంది. ఎంపీలు పార్లమెంటరీ కార్యాలయానికి రావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. మణిపూర్ ఇష్యూలో కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా పార్లమెంట్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని విపక్షాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమికి 330 మంది సభ్యుల బలం ఉంది. 26 పార్టీలతో ఏర్పడిన విపక్షాల కూటమి ఇండియాకు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మంది సభ్యులు ఏ కూటమిలో చేరలేదు. 2018లో ఎన్డీఏ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అప్పుడు ఎన్డీఏకు మద్దుతుగా 325 ఓట్లు, వ్యతిరేకంగా 126 ఓట్లు రావడంతో అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం వృథా ప్రయాసని బీజేపీ నేతలు అంటున్నారు. 2018లో ఏం జరిగిందనేది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గుర్తు చేశారు.
మణిపూర్ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో మంగళవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని పార్టీల సభాపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. మణిపూర్ పై ప్రధాని ప్రకటన చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. హోం మంత్రి అమిత్ షా సమాధానమిస్తారని కేంద్రం పేర్కొంది. దీంతో ఈ సమావేశం ఎలాంటి ఫలితాన్నివ్వలేదు. మణిపూర్ అంశం, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్పై సస్పెన్షన్ వేటుతో రాజ్యసభలోనూ కార్యకలాపాలూ సజావుగా సాగలేదు.
మరోవైపు మణిపూర్పై చర్చించడానికి సిద్ధమని ప్రతిపక్ష నేతలకు హోంమంత్రి అమిత్ షా లేఖ రాశారు. విపక్షాల అమూల్య సలహాలను కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. అతి ముఖ్యమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్ని పార్టీలు సహకరిస్తాయని భావిస్తున్నానన్నారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని పార్టీలకతీతంగా స్పందించాలని కోరారు. మణిపూర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొందామని అమిత్ షా పిలుపునిచ్చారు.