Rains : అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో 46.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సగటును 4.39 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వానల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో చెరువులకు గండ్లు పడ్డాయి. పంటలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.
హైదరాబాద్, వరంగల్లో భారీ వర్షాలకు పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో వాగులో పడి ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురానికి చెందిన ఓ వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు.
తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కొన్ని జిల్లాల్లో వర్షాలతోపాటు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో గంటకు 4 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశముందని తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాలు రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ఈ నెల 20, 21, 22 తేదీల్లో కూడా సెలవులు ఇచ్చారు.