YSRCP: అసలే రాయలసీమ. ఫ్యాక్షన్ పగల ఖిల్లా. పగలు, ప్రతీకారాలు.. వేటకొడవళ్లు, నాటు బాంబులు. నరకడాలు, చంపుకోవడాలు. ఇవన్నీ ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది. ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టింది. కానీ, ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. గ్రామాల్లో ఇప్పటికీ పగలు రగులుతూనే ఉన్నాయ్. దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయ్. తాజాగా, నంద్యాల జిల్లాలో ఓ ఇంట్లో నాటు బాంబులు దొరకడం కలకలం రేపుతోంది. అవి వైసీపీ నేతకు చెందినవిగా తెలుస్తుండటం రాజకీయంగా సంచలనంగా మారింది.
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఓ ఇంటిపైనున్న వాటర్ ట్యాంక్లో కనిపించాయి నాటుబాంబులు. ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచి.. నీళ్ల ట్యాంక్లో రహస్యంగా దాచారు. ఇంటి ఓనర్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా.. 20 నాటు బాంబులు బయటపడ్డాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు వచ్చింది.
ఆ బాంబులు దాచింది.. అదే ఇంట్లో అద్దెకు ఉండే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ మధు అని అనుమానిస్తున్నారు. మధు.. శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు కావడంతో జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
ఇంతకీ ఆ బాంబులు ఎవరివి? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరి కోసం దాచారు? ఏదైనా కుట్ర చేశారా? ఇలా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.