Hyderabad: వాన పడితే చాలు ట్రాఫిక్ నరకమే. గంటల తరబడి జంక్షన్లు జామ్. హైదరాబాద్ను వర్షం ఆగమాగం చేస్తోంది. ఇప్పటికే వారం నుంచి వానలు పడుతుండగా.. ఇంకో నాలుగు రోజులు అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ బాంబు పేల్చింది. ఈ వెదర్ రిపోర్ట్తో అందరికంటే ఎక్కువగా ఉలిక్కిపడింది ఐటీ ఎంప్లాయిసే.
హైదరాబాద్ అంతా ట్రాఫిక్ జామ్స్ ఉన్నా.. సైబరాబాద్ దగ్గర పరిస్థితి అట్టాఇట్టా ఉండదు. కిలోమీటర్ల మేర కార్లు. గంటల తరబడి వెయిటింగ్. అన్నీ ఐటీ కంపెనీలే కావడంతో.. అందరికీ 6 కల్లా లాగ్అవుట్ ఉండటంతో.. ఉద్యోగులంతా కారేసుకుని ఒకేసారి రోడ్డు మీదకు వస్తున్నారు. ఇంకేం.. హైటెక్ సిటీ మొత్తం జామ్.
ఈసారి ఐకియా సెంటర్లో జరిగిన ట్రాఫిక్ జామ్ వీడియో ఫుల్ ట్రెండింగ్ అయింది. నాలుగు వైపులా.. కనుచూపు మేర.. కార్లే కారు. ముందుకు కదిలితే ఒట్టు. స్వయంగా సైబారాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రోడ్డు మీదకు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించినా.. గంటలకు గంటలు టైమ్ పట్టింది. అందుకే, మళ్లీ వాన పడుతుందని వెదర్ రిపోర్ట్ రాగానే.. ట్రాఫిక్ పోలీసులు ఈసారి ముందస్తు అలర్ట్ అయ్యారు. హైటెక్ సిటీలోని ఐటీ కంపెనీలకు లాగ్అవుట్ టైమింగ్స్ ఫిక్స్ చేశారు.
ఈ మూడు రోజులు.. 3 దశల్లో లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ అవుట్ చేసుకోవాలని తెలిపారు.
ఐకియా నుంచి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ కార్యాలయాల ఉద్యోగులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ అవుట్ అవ్వాలి.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ కంపెనీలకు.. సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు లాగ్ అవుట్ టైమ్ ఇచ్చారు.
అంతా ఒకేసారి బయటకు రాకుండా.. ఇలా వేరు వేరు టైమింగ్స్కి ఎంప్లాయిస్ బయటకు వస్తే.. ట్రాఫిక్ జామ్స్ ఏర్పడే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయనేది పోలీసుల లెక్క. మరి, ఈ టైమింగ్స్ను ఎంప్లాయిస్ పాటిస్తారా? తామే ముందు వెళ్లాలనే ఆరాటంలో.. ఎప్పటిలానే అంతా ఒకేసారి రోడ్డెక్కి.. చిక్కుకుపోతారా? చూడాలి.