Sajjala: వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్సీట్ సంచలనంగా మారింది. సునీత స్టేట్మెంట్ వైసీపీలో ప్రకంపణలు సృష్టిస్తోంది. వైఎస్ భారతి, సజ్జల తన ఇంటికి వచ్చారని.. ప్రెస్మీట్ పెట్టి ఇష్యూని క్లోజ్ చేయాలని చెప్పారంటూ సునీత వాంగ్మూలం ఇచ్చారు. అవినాశ్రెడ్డికి సంబంధం లేదంటూ.. ఆయన పేరు కూడా ప్రెస్మీట్లో ప్రస్తావించాలంటూ సజ్జల చెప్పారని సునీత చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది.
సునీత వాంగ్మూలం, సీబీఐ ఛార్జ్షీట్పై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాను తన భార్యతో కలిసి ఒక్కసారి మాత్రమే సునీత ఇంటికి వెళ్లానని.. భారతితో కలిసి ఒక్కసారి కూడా వెళ్లలేదంటూ చెప్పుకొచ్చారు. సునీత చెప్పిందంతా తప్పేనని అన్నారు. నాలుగేళ్ల తర్వాత కల్పిత కథతో, టీడీపీ మసాలాతో.. సీబీఐ ఛార్జ్షీట్ వేసిందని ఆరోపించారు.
బేసిక్ లాజిక్ మర్చిపోయి సీబీఐ చెత్త దర్యాప్తు చేసిందని మండిపడ్డారు సజ్జల. వివేకా హత్య వల్ల ఎవరికి నష్టమో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగిందని తప్పుబట్టారు. ఆధారాలన్నీ ఒకవైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగిందని మండిపడ్డారు సజ్జల. జగన్ను డీమోరలైజ్ చేసేందుకే ఈ కుట్రలన్నారు.