Andhra news today : ఆపదలో అండగా ఉండి ధైర్యం చెప్పాల్సిన ఓ పోలీసు ఉద్యోగి మానవ మృగంలా రెచ్చిపోయాడు. పోలీసుశాఖ తలందించుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు. అనంతపురం జిల్లా కంబదూరు పీఎస్లో.. ఓ మహిళపై హోంగార్డు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు ఈనెల 12న కంబదూరు పీఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే కనిపించకుండా పోయిన మహిళే.. ఈనెల 22న పోలీస్స్టేషన్కు వెళ్లింది. కుమార్తె దొరికిందని తల్లిదండ్రులకు పోలీసులు సమాచారమిచ్చారు. వారు వచ్చే సరికి ఆలస్యమవడంతో.. ఆమె పీఎస్లోనే చాలా సేపు ఉండిపోయింది.
ఇది గమనించిన హోంగార్డు శివ.. ఆమెను రిసెప్షన్ గదిలోకి తీసుకెళ్లాడు. మద్యం మత్తులో తానొక పోలీసుననే విషయాన్ని మరిచి ఆ మహిళపై అఘాయిత్యానికి యత్నించాడు. బాధితురాలు గట్టిగా అరిచి ఏడుస్తూ బయటకు వచ్చేసింది. వెంటనే శివ అక్కడినుంచి పారిపోయాడు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి హోంగార్డు శివను సస్పెండ్ చేశారు.