BRS: వనమా వెంకటేశ్వరావు ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో…బీఆర్ఎస్ లో ఉన్న మరికొందరు ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కూడా వివాదం నడుస్తోంది. టీడీపీ తరుఫున ఒకసారి, బీఆర్ఎస్ తరుఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చెన్నమనేని.
చెన్నమనేని రమేష్ ఉద్యోగం కోసం 1990 జర్మనీకి దేశానికి వెళ్లారు. అతనికి 1993లో జర్మన్ పౌరసత్వం రావడంతో భారతీయ పాస్పోర్ట్ను అప్పగించారు. తరువాత మళ్ళీ 2008లో ఇండియాకు తిరిగి వచ్చారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంజూరు చేసే భారతీయ పౌరసత్వం కోసం తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా రమేష్ పౌరసత్వం పొందారని ఆరోపణలు రావడంతో, కోర్టులో కేసు నడుస్తోంది. ఎమ్మెల్యే భారత పౌరసత్వాన్ని కోర్టులో సవాలు చేశారు కాంగ్రెస్కు చెందిన ఆది శ్రీనివాస్.
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎన్నికపై కూడా హైకోర్టులో కేసు విచారణ నడుస్తోంది. ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని కోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్.
ధర్మపురి నియోజకవర్గం ఎన్నికపై కూడా వివాదం నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని కొన్ని చోట్ల ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, రీకౌంటింగ్లో అవకతవకలు జరిగాయని 2019లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అప్పటి నుంచి పలు దఫాలుగా ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవల స్ట్రాంగ్ రూమ్లు తెరిచి వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కూడా కోర్టు తీర్పునిచ్చింది.
మరోవైపు, మంత్రి శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో చుక్కెదురైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ కు అర్హత లేదని, కొట్టివేయాలని కోరుతూ శ్రీనివాస్ గౌడ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువర్గాల వాదనలు పూర్తి అయ్యాయి. శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ ను కొట్టివేసింది హైకోర్టు. పిటిషనర్ వేసిన పిటిషన్ ను విచారణకు అనుమతించింది.
తాజాగా, తప్పుడు అఫిడవిట్ కేసులో ఎమ్మెల్యే వనమాపై వేటు పడగా.. ఇలానే రకరకాల ఆరోపణలతో కేసులు ఎదుర్కొంటున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.