Narendra Modi news today live(Latest political news in India): మణిపూర్ అంశం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ విపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంపై మండిపడ్డారు. దిశాదశ లేకుండా విపక్ష నేతలు ముందుకెళతున్నారని మోదీ విమర్శించారు.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ప్రతిపక్షాల తీరును తప్పుపట్టారని కాషాయ పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక లక్ష్యం లేకుండా ముందుకెళ్లే విపక్షాలను తాను ఎప్పుడు చూడలేదని మోదీ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అధికారంలోకి రావాలనుకోవడం లేదని చురకలు అంటించారు. ఎప్పటికీ విపక్షంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. పేరులో ఇండియా ఉంటే సరిపోదని.. వారు ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ఆ పదాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ లాంటి సంస్థల పేర్లలో కూడా ఇండియా ఉందని విపక్ష కూటమిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగడంలేదు. మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై రగడ కొనసోగుతోంది. ఈ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్లో ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కూటమికి మోదీని వ్యతిరేకించడమేనని ఏకైక ఎజెండా అని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయంపై మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
మరోవైపు విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. ప్రతిపక్షాల డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడం లేదని.. అవిశ్వాస తీర్మానం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విపక్ష నేతలు భావిస్తున్నారు. ఈ రకంగా మణిపూర్ సహా అన్ని అంశాలపై చర్చకు తీసుకురావాలని చూస్తున్నారు.