Telangana high court on Vanama Venkateswara rao(Telangana news live) : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. ఆయన తప్పుడు అఫిడవిట్ సమర్పించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఆయనపై ఓడిపోయిన జలగం వెంకట్రావును 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా డిక్లేర్ చేసింది హైకోర్టు.
వనమా గెలుపును సవాల్ చేస్తూ జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి జలగం వెంకట్రావు ఓడిపోయారు. ఆ తర్వాత వనమా కూడా గులాబీ గూటికి చేరారు. ఎన్నికల సమయంలో వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని జలగం ఆరోపించారు. ఇరుపక్షాల వాదన తర్వాత అఫిడవిట్ లో పేర్కొన్న కేసులు, ఆస్తులు తప్పని హైకోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు చేసింది.
సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం.. ఎన్నికల అఫడివిట్లో ఆస్తుల వివరాలు, విద్యార్హతలు, కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించాలి. అయితే వనమా ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. ఇది క్రిమినల్ చర్య అని గతంలో కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీని ఆధారంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జలగం వెంకట్రావు. అయితే ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా వనమా తీసుకున్న జీతంతోపాటు ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన ఖర్చుల మొత్తాన్ని తిరిగి రికవరీ చేసే అవకాశముంది. ఆ డబ్బులను జలగం వెంకట్రావు ఇవ్వనున్నారు.
అఫిడవిట్లో తప్పులు చెప్పినా.. సమాచాారాన్ని దాచిపెట్టినా అది నేరం. హైకోర్టు తీర్పు ద్వారా పదవి కోల్పోవడం గతంలోను జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా మడకశిర నుంచి ఈరన్న ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఆయన భార్య అంగన్వాడీ ఉద్యోగి అని, ఆ విషయాన్ని అఫిడవిట్లో దాచి పెట్టారని ప్రత్యర్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నాలుగేళ్ల తర్వాత ఈరన్నను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన తిప్పేస్వామికి ఎమ్మెల్యే అవకాశం లభించింది. ఐదేళ్ల టర్మ్లో చివరి మూడు నెలలు తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగారు.