Rajasthan latest political news(Breaking news of today in India): రాజస్థాన్లో రెడ్ డైరీ వ్యవహారం కలకలం రేపింది. సీఎం అశోక్ గహ్లోట్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని ఇటీవల ఉద్వాసనకు గురైన మంత్రి రాజేంద్ర గుఢా ఆరోపించారు. రెడ్ డైరీలో ఆ వివరాలు ఉన్నాయని అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో సభలో కాంగ్రెస్ సభ్యులు రాజేంద్ర గుఢాపై దాడి చేశారు. ఆ తర్వాత ఆయనను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఈ తీర్మానాన్ని రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదించింది.
సభకు అంతరాయం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ రాజేంద్ర గుఢాపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ను కూడా ఈ అసెంబ్లీ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు. మరోవైపు గుఢాకు మద్దతుగా బీజేపీ సభ్యులు సభలో గళమెత్తారు. అసెంబ్లీలో నిరసన చేపట్టారు. రెడ్ డైరీలను చూపుతూ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
రాజస్థాన్ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ధర్మేంద్ర రాఠోడ్ ఇంట్లో గతంలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఎం అశోక్ గహ్లోట్ ఆదేశాలతో తాను రెడ్ డైరీని జాగ్రత్త పరిచానని రాజేంద్ర గుఢా తెలిపారు. సీఎం, ఆయన కుమారుడు వైభవ్ గహ్లోట్ ఆదేశాలతో డబ్బును ఎమ్మెల్యేలకు ఇచ్చానని రాఠోడ్ రెడ్ డైరీలో రాశారని వెల్లడించారు. ఈ డైరీలో రూ.2.5 కోట్లను ఎమ్మెల్యేలకు ఇచ్చిన విషయం ఉందని పేర్కొన్నారు.
డబ్బు తీసుకున్న ఎమ్మెల్యేలకు నార్కో పరీక్ష చేయాలని గుఢా డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు తనపై దాడి చేసి ఆ డైరీని లాక్కున్నారని ఆరోపించారు. అయినాసరే డైరీలో కొంత భాగం తన వద్ద ఉందని తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని రాజేంద్ర గుఢా సభ బయటకు వచ్చిన తర్వాత ప్రకటించారు. ఇప్పుడు రెడ్ డైరీ అంశం రాజస్థాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.