Rain news today telangana(Telugu flash news): తెలంగాణకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరో 3 రోజులపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
భారీగా కురిసిన వర్షానికి హైదరాబాద్ మరోసారి వణికిపోయింది. రహదారులు జలమయమయ్యాయి. సోమవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి నగర వాసులు అల్లాడిపోయారు. బిక్కుబిక్కుమంటూ ఇళ్లకు చేరుకున్నారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ సమ్యలు తలెత్తాయి.
నగరంలో నాలాలు, మ్యాన్హోల్లు పొంగిపొర్లుతున్నాయి. నాలాల సామర్థ్యం కన్నా రెట్టింపు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో ఉన్న నాలాలకు గంటకు 2 సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకునే శక్తి ఉంది. అయితే అంతకుమించి వాన కురవడంతో నగరంలోని రహదారులు చెరువుల్లా మారాయి.
రోడ్లపై భారీగా నీరు నిలిచి ఇళ్లలోకి వస్తుండటంతో పలుచోట్ల మ్యాన్హోళ్ల మూతలు తెరిచారు. ఎక్కడ గుంతలున్నాయో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల రోడ్లన్నీ మోకాళ్ల లోతు వరకు నీళ్లతో నిండిపోయాయి.
సోమవారం సాయంత్రం మియాపూర్లో అరగంట వ్యవధిలోనే 3.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా సంగెంలో 9 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 8.4 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో 7.7 సెంటీమీటర్లు, హైదరాబాద్ శివరాంపల్లిలో 6.48 సెంటీమీటర్లు, చార్మినార్లో 6.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.