West Indies Vs India : వెస్టిండీస్ పై రెండో టెస్టులో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలన్న టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. వాన కురవడంతో చివరిరోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఈ టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. విండీస్ గెలవాలంటే 289 పరుగులు చేయాలి. కానీ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడలేదు. ఐదో రోజు ఆట రద్దైంది. అంపైర్లు మ్యాచ్ ను డ్రాగా ప్రకటించారు. తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన రోహిత్ సేన సిరీస్ ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులు చేసింది. కోహ్లీ అద్భుతంగా ఆడి సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 181/2 వద్ద డిక్లేర్ చేసింది. రోహిత్, ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 365 లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ జట్టు.. నాలుగో రోజు ఆటముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన మహ్మద్ సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
భారత్ -వెస్టిండీస్ మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ గురువారం బ్రిడ్జిటౌన్ లో జరుగుతుంది. ఈ నెల 29న రెండో వన్డే, ఆగస్టు 1న మూడో మ్యాచ్ నిర్వహిస్తారు. వన్డే సిరీస్ తర్వాత 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ టీమిండియా-విండీస్ మధ్య జరుగుతుంది. ఆగస్టు 3,6,8,12, 13 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరుగుతాయి.