Vande Bharat : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు క్రమంగా అన్ని రాష్ట్రాల్లోనూ పట్టాలెక్కుతున్నాయి. వీటిలో ప్రయాణికుల భద్రత కోసం ఆధునిక ఫీచర్లను పరిచయం చేయడంతోపాటు, సాంకేతికంగా కూడా వీటిని ఉన్నతంగా రూపొదించారు.
ఈ క్రమంలోనే వందే భారత్ కోచ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని ఫీచర్లను మరింత మెరుగుపరచనున్నారు. ఇటీవల చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సందర్శించారు. ఈ సందర్భంగా వందే భారత్ రైళ్లలో కొన్ని మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. వందే భారత్ కోచ్లలో ప్రయాణికులు కూర్చునే సీట్ల కుషన్ గట్టిగా ఉందనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో..కొత్త కోచ్లలో మెత్తటి కుషన్లను ఉపయోగించనున్నారు.
అలాగే, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మార్చడంతోపాటు, ఫుట్రెస్ట్ను మరింత పొడిగించనున్నారు. వీటితోపాటు సీట్ల వెనుక మ్యాగజైన్ బ్యాగ్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు.ప్రయాణ సమయంలో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు సీటు రిక్లైనింగ్ యాంగిల్ను పెంచనున్నారు. దీంతో ప్రయాణికులు తమ సీట్లను మరింత వెనక్కి జరపొచ్చు. దివ్యాంగుల వీల్ఛైర్ కోసం ప్రత్యేక పాయింట్ను ఏర్పాటు చేసి, అక్కడే వారికి సీటు కేటాయించనున్నారు.
అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్తో మాట్లాడేందుకు ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో బోర్డర్లెస్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్లో మార్పులు చేయనున్నారు. కోచ్లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నారు.ప్రయాణికులకు మెరుగైన ఎయిర్ కండిషనింగ్ కోసం ఎయిర్టైట్ ప్యానల్స్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అత్యవసర సమయాల్లో రైలును ఆపేందుకు ఉపయోగించే ఎమర్జెన్సీ పుష్ బటన్ను లోకో పైలట్కు సులువుగా యాక్సెస్ చేసేందుకు వీలుగా మార్పులు చేయనున్నారు.