Hyderabad rain news(Latest news in telangana): హైదరాబాద్లో సోమవారం సాయంత్రం సడెన్గా కుంభవృష్టి కురిసింది. నిలబెట్టి వాన దంచికొట్టింది. నగరమంతా దట్టమైన కారుమబ్బులు అలుముకున్నాయి. చీకట్లో సూదుల్లా వాన చినుకులు విరుచుకుపడ్డాయి. గంటల గ్యాప్లోనే అతిభారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నిండా మునిగింది.
అసలే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైమ్. ఎక్కడి ట్రాఫిక్ అక్కడే. జంక్షన్లన్నీ జామ్. రోడ్లన్నీ నీట మునిగాయి. వరద ఏరులై పారింది. గతవారమంతా నిదానంగా, కామ్గా వాన పడితే.. ఈసారి మాత్రం ఉరుములు, మెరుపులతో.. ఒక్కసారిగా వర్షం కుమ్మేసింది. వరద బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ను ఆగమాగం చేసేసింది. హోరు గాలిలో.. వాన నీటిలో.. వాహనదారులు నరకం చూశారు.
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వెంటాడుతున్నాయి. వారం రోజులుగా దంచికొడుతునే ఉన్నాయి. రెండు రోజుల నుంచి కాస్త వర్షాలు తెరిపినిచ్చాయని అనుకునేలోపే.. వాతావరణ శాఖ మళ్లీ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా వచ్చే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఏపీకి రెడ్ అలర్ట్, తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర దగ్గర్లో వాయువ్య ప్రాంతంలో ఏర్పడుతుందని ఐఎమ్డీ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో.. ఏపీలో అతిభారీ వర్షాలు కురుస్తాయని.. తెలంగాణలో ఈ నెల 25 నుంచి 27 వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
ఏపీలో ఈ నెల 25 నుంచి 27 వరకు రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో 25, 26 తేదీల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా రుతుపవన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇప్పటికే భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తడంతో.. గోదావరిపై ఉన్న అన్ని జలాశయాలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దాదాపు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి.. వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం, రాజమండ్రి, ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. ఇంతకు ముందే జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కరకట్ట దగ్గర స్నాన ఘట్టాలు కూడా మునిగిపోయాయి. ఏపీలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వైనతేయ, వశిష్ట, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాలు మూడు, నాలుగు రోజులుగా వరద నీటిలోనే ఉన్నాయి. అరటి, కూరగాయల పంట భూములన్నీ నీట మునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మళ్లీ భారీ వర్షాలు అని తెలియగానే.. వామ్మో అని హడలిపోతున్నారు.